వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం టీటీడీ ఆన్లైన్లో జారీచేసిన రూ.300 ఎస్ఈడీ టికెట్లకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కొనుగోలుకు భక్తులు పోటీపడ్డారు. ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసిన టికెట్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపారు. దీంతో 21 నిమిషాల వ్యవధిలోనే అన్నీ పూర్తి అయ్యాయి. వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు అందుబాటులోకి తెచ్చారు. వీటి విక్రయం ద్వారా టీటీడీకి రూ.6.75 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. ఇందుకోసం 2.25 లక్షల ఎస్ఈడీ టికెట్లు టీటీడీ ఆన్లైన్లో జారీచేసింది. ప్రస్తుతం ఆన్లైన్ టికెట్ల జారీకి క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగిస్తుండడంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బుక్ చేసుకున్నట్లు టీటీడీ ఐటీ జీఎం సందీప్రెడ్డి తెలిపారు. మరోవైపు తిరుపతిలో కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి.. తొమ్మిది ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి 4.25 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు ముందు రోజు నుంచి జారీ చేయనున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన శుక్రవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు వెన్నముద్దకృష్ణుని అలంకారంలో చిన్నశేషవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు రాజసంగా ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాహలం, భక్తుల కర్పూరహారతుల నడుమ వాహనసేవ వైభవంగా జరిగింది.బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. షభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలతోపాటు పలు వేదికలపై నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి.
చిన్నశేష వాహనసేవలో…
బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన శుక్రవారం రాత్రి చిన్నశేష వాహన సేవలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు చక్కటి కళారూపాలను ప్రదర్శించారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి వేషధారణలతో ఉండగా, ఇతర విద్యార్థులు పలు అన్నమయ్య సంకీర్తనలకు లయబద్ధంగా సంప్రదాయ నృత్యం చేశారు. అదేవిధంగా లంబాడి నృత్యం, దింసా నృత్యం, కరగం, వీరనాట్యం, భరతనాట్యం, తిరుమొళి నాట్యం, కోలాటం, కేరళ కళాకారుల డ్రమ్స్ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తిరుచానూరులోని ఆస్థానమండపంలో…
తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం మంగళధ్వని, వేద పారాయణం నిర్వహించారు. అనంతరం నరసాపురానికి చెందిన శ్రీ సింగరాచార్యులు భక్తామృతం ధార్మికోపన్యాసం, బెంగళూరుకు చెందిన శ్రీమతి ఐశ్వర్య మహేష్ భక్తి సంగీతం వినిపించారు. మధ్యాహ్నం తిరుపతికి చెందిన శ్రీ ఎం.రాముడు బృందం హరికథ, సాయంత్రం శ్రీమతి సుశీల బృందం అన్నమయ్య విన్నపాలు, ఊంజల్సేవలో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ శబరిగిరీష్ బృందం సంకీర్తనలు ఆలపించారు.
ఇతర వేదికలపై..తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు సురభి కళాకారులు శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన డాక్టర్ మాధురి బృందం భక్తి సంగీతం, హైదరాబాద్ కు చెందిన శ్రీమతి జానకి బృందం భరతనాట్యం చక్కగా ప్రదర్శించారు. రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ చంద్రశేఖర రావు బృందం సంగీతం వినిపించారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ధర్మవరానికి చెందిన శ్రీమతి మానస బృందం నృత్య కార్యక్రమం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa