ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘‘మీరు కొత్తగా బట్టలు విప్పాల్సిన పనిలేదు’’.. కాంగ్రెస్ షర్ట్ లెస్ నిరసనపై మోదీ తీవ్ర విమర్శలు

national |  Suryaa Desk  | Published : Sun, Feb 22, 2026, 04:38 PM

న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లోని యువజన కాంగ్రెస్ నాయకులు దూసుకొచ్చి.. అర్ధనగ్నంగా చేపట్టిన నిరసనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో స్పందించారు. యూత్ కాంగ్రెస్ నిరనసలను ఖండించి మోదీ.. కాంగ్రెస్ మురికి రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. దేశంలోనే అతి పురాతన పార్టీ కాంగ్రెస్ సైద్ధాంతికంగా దిగజారిపోయిందని ఈ ఘటన స్పష్టం చేస్తోందని మోదీ దుయ్యబట్టారు. మీరట్‌ మెట్రో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభం అనంతరం ప్రదాని మోదీ మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలని ప్రజలు కష్టపడుతుంటే.. ప్రగతిని కొన్ని పార్టీలు ఓర్వలేకపోతున్నాయి. ప్రపంచంలోనే భారీ ఏఐ సదస్సును నిర్వహించడం దేశంలో ప్రతి ఒక్కరికీ గర్వకారణం. కానీ ఈ అంతర్జాతీయ వేదికను తన నీచ, నగ్న రాజకీయాలకు కాంగ్రెస్ వాడుకుంది’’ అని మోదీ ధ్వజమెత్తారు.


‘‘విదేశీ అతిథుల ఎదుట కాంగ్రెస్ నాయకులు నగ్నంగా నిలబడి నిరసన తెలిపారు. అసలు మీ నిజస్వరూపం గురించి దేశ ప్రజలందరికీ తెలుసు.., మళ్లీ కొత్తగా మీరు బట్టలు విప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ’’ అని ప్రధాని ధ్వజమెత్తారు. దేశం పరువు తీయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని మోదీ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా తన సమాధిని తవ్వాలని చూస్తున్నారని, తన కన్నతల్లిని దూషిస్తున్నారని మండిపడ్డారు. కానీ, దేశ ప్రతిష్ఠకు సంబంధించిన వేదిక వద్ద ఇలా ప్రవర్తించడం హద్దులు మీరడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.


దేశం పరువు తీసిన వాళ్లను మందలించాల్సింది పోయి.. నిరసనకారులను కాంగ్రెస్ నాయకులు ప్రశంసించడం దురదృష్టకరమని మోదీ పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనను విమర్శించిన ఇండియా కూటమిలోని పార్టీలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.


ఇక, ఏఐ సమ్మిట్‌లోకి జరిగే భారత మండపం వద్దకు ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు ఉన్న టీ-షర్టులను ధరించి వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులు.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా భారత్, అమెరికా ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ.. ట్రంప్‌కి మోదీ భయపడ్డారని ఆరోపించారు. అడ్డుకోడానికి అక్కడ భద్రతా సిబ్బంది ప్రయత్నించగా.. వారితో కాంగ్రెస్ యువజన నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రెటరీ కృష్ణ హరి, బిహార్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కుందన్ యాదవ్, యూపీ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్, జాతీయ సమన్వకర్త నరసింహ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఇండియా కూటమిలోని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇది సరైన చర్య కాదని , దేశానికే అవమానమని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa