ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"నాకంటూ లోకంలో ఇంకెవరూ లేరు": ఢిల్లీ కారు ప్రమాదంలో చనిపోయిన డెలివరీ బాయ్ తల్లి

national |  Suryaa Desk  | Published : Sun, Feb 22, 2026, 03:45 PM

 "అమ్మా.. నిన్ను రాణిలా చూసుకుంటాను. మన కష్టాలన్నీ తీర్చేస్తాను" అని ఆ కొడుకు తల్లికి మాట ఇచ్చాడు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ నిరుపేద కుటుంబానికి ఏకైక ఆశాదీపంగా నిలిచిన అతడే.. తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. ముఖ్యంగా అతివేగం, బాధ్యతారాహిత్యంతో కారు నడిపిన ఓ వ్యక్తి.. నేరుగా వాహనాన్ని సదరు పేద యువకుడి మీదకు ఎక్కించగా అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తాజాగా ఆయన తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతం అయ్యారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో.. తనకు లోకంలో ఎవరూ లేకుండా పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


అసలేం జరిగిందంటే..?


మృతుడిని 25 ఏళ్ల హేమ్ శంకర్ (రోహిత్) గా గుర్తించారు. 2015లో తండ్రిని కోల్పోయిన రోహిత్ కుటుంబం అప్పటి నుంచి ఆర్థిక కష్టాలతో సతమతం అవుతోంది. అయితే తల్లి ఇళ్లల్లో పనులు చేస్తూ కుమారుడిని పెంచి పెద్ద చేయగా.. ప్రస్తుతం ఆమె వయసు పైబడింది. ఈక్రమంలోనే ఆమెకు చూపు మందగించడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రోహిత్ ఇంటి బాధ్యతను భుజాన వేసుకున్నాడు. కేవలం కొన్ని వేల రూపాయల అదనపు ఆదాయం కోసం రాత్రిపూట డెలివరీ ఏజెంట్‌గా పని చేయడం మొదలు పెట్టాడు. తాజాగా లోన్ తీసుకుని కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ పై శనివారం రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో డెలివరీకి వెళ్తుండగా మృత్యువు కారు రూపంలో వచ్చి అతడిని కబళించింది.


అతివేగం.. మద్యం మత్తు..


నజాఫ్‌గఢ్‌కు చెందిన 27 ఏళ్ల మోహిత్ కుమార్ అనే వ్యక్తి నడుపుతున్న బ్లాక్ కలర్ కారు.. రోహిత్ స్కూటర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారు వేగం గంటకు 120 నుంచి 150 కిలో మీటర్ల వరకు ఉండవచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం ఎంత భీభత్సంగా జరిగిందంటే.. కారు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి. అక్కడికక్కడే రోహిత్‌ది ఒక కాలు తెగిపడింది. కారులో ఉన్న ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండగా.. ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ స్థానికులు వారిద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై గతంలోనూ అతివేగం కారణంగా పలు ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.


"నాకు ఇంకెవరున్నారు?": తల్లి ఆవేదన


తన కొడుకు మరణవార్త విన్న రోహిత్ తల్లి శోకసముద్రంలో మునిగిపోయింది. "నా భర్త పోయినప్పుడనా నా జీవితం నాశనం అయింది. కానీ పిల్లల కోసమే బతికాను. ఇప్పుడు కొడుకును కూడా కోల్పోయాను. ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరున్నారు? నన్ను ఎవరు చూసుకుంటారు?" అంటూ ఆమె చేస్తున్న ఆక్రందనలు అక్కడి వారిని కన్నీరు పెట్టించాయి. రోహిత్ సంపాదనతోనే ఆ కుటుంబం ఒక చిన్న గదిలో కాలం వెళ్లదీస్తోంది.


న్యాయం కోసం పోరాటం


నిందితుడు మోహిత్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. అయితే ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎందరో తల్లుల కడుపుకోతకు గురవుతున్నారని రోహిత్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa