ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఐఎస్ఐ లింకున్న ఎనిమిది మంది అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Sun, Feb 22, 2026, 03:56 PM

భారత గడ్డపై మరోసారి నెత్తురు పారించాలని చూస్తున్న ఉగ్రవాదుల స్కెచ్‌ను భద్రతా దళాలు చిత్తు చేశాయి. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో జరిపిన మెరుపు దాడుల్లో ఈ ముఠా గుట్టురట్టయింది. పట్టుబడిన వారిని ఢిల్లీ పోలీసులకు అప్పగించి విచారణ వేగవంతం చేశారు.


తమిళనాడులో నక్కిన ముష్కరులు


తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఉన్న గార్మెంట్ తయారీ కేంద్రాల్లోనే ఆరుగురు ముష్కరులను గుర్తించారు. అయితే వారి పేర్లు మిజానుర్ రెహ్మాన్, మొహమ్మద్ శబత్, ఉమర్, మొహమ్మద్ లిటన్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ ఉజ్జల్ అనే అని పోలీసులు తెలిపారు. వీరు సాధారణ కార్మికుల ముసుగులో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఒకరు బంగ్లాదేశ్ జాతీయుడు కాగా.. మిగిలిన వారంతా నకిలీ ఆధార్ కార్డులతో భారత్‌లో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరి నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను కూడా పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరిని పశ్చిమ బెంగాల్‌లో అదుపులోకి తీసుకున్నారు.


టార్గెట్ ఎర్రకోట.. లష్కరే ప్రతీకారేచ్ఛ!


గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన కారు పేలుడు ఘటనలో 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ గాయం మానకముందే మరోసారి ఎర్రకోట సమీపంలో, చాందినీ చౌక్‌లోని ప్రముఖ ఆలయాల వద్ద పేలుళ్లకు లష్కరే తాయిబా కుట్ర పన్నినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ నెల ప్రారంభంలో పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగా భారత్‌లో విధ్వంసం సృష్టించాలని ఐఎస్ఐ వీరిని ప్రోత్సహించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.


నవంబర్ నాటి ఎర్రకోట పేలుడుకు కారణమైన ఉమర్ మొహమ్మద్ అనే డాక్టర్, ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు దొరకడంతో భయపడి రాజధానిలో కారు పేలుడుకు పాల్పడ్డాడు. అప్పట్లో 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచే ఉగ్రవాద మూలాలపై కన్నేసిన ఏజెన్సీలు.. తాజా అరెస్టులతో ఒక పెను ప్రమాదాన్ని అడ్డుకోగలిగాయి. పట్టుబడిన ఈ ఎనిమిది మంది నుంచి కీలక సమాచారాన్ని సేకరించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa