ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక బీజేపీ చీఫ్‌గా విజయేంద్ర,,,,,లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యం

national |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2023, 08:07 PM

దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ ఆంధ్రా సీఎంగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, సొంత పార్టీ ఏర్పాటు చేయడం, జైలుకెళ్లడం.. తర్వాత సీఎం కావడం ఇవన్నీ తెలిసిందే. టీడీపీ బాధ్యతలను నారా లోకేశ్ మెల్లగా భుజానికెత్తుకుంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే సీఎం కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్.. మూడోసారి పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పీఠంపై కూర్చునే అవకాశం ఉంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే.. ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ మాజీ సీఎం కరుణానిధి కుమారుడు కాగా.. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా పని చేస్తుండటంతోపాటు.. తండ్రి తర్వాత డీఎంకే పార్టీ బాధ్యతలను, అవసరమైతే సీఎం బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు.


సౌత్‌లో ఈ మూడు రాష్ట్రాల రాజకీయాలతో పోలిస్తే కర్ణాటకలో రాజకీయాలు కాస్త భిన్నంగా ఉంటాయి. అయితే ఇప్పుడు అక్కడ కూడా ఓ వారసుడు తన ఆగమనాన్ని ఘనంగా చాటుతున్నారు. అది కూడా కుటుంబ రాజకీయాలను ఏమాత్రం ఇష్టపడని బీజేపీ నుంచి. ఆయన ఎవరో కాదు యడియూరప్ప కుమారుడు బీఎస్ విజయేంద్ర. గత అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి నియోజకవర్గమైన షికారిపుర నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విజయేంద్రకు.. కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్ష పదవి నుంచి అధ్యక్షుడిగా ప్రమోషన్ దక్కింది. దక్షిణాదిన బీజేపీ గెలిచిన తొలి రాష్ట్రం కర్ణాటక. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ ఓటమి ఎదురైంది. మాజీ సీఎం యడియూరప్పను పక్కనబెట్టిన బీజేపీకి ఆయన సామాజికవర్గమైన లింగాయత్‌లు దూరమయ్యారు. మెజార్టీ లింగాయత్‌లు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేశారు. యడియూరప్ప రెండో కుమారుడైన విజయేంద్రను పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించినప్పటికీ.. పెద్ద కుమారుడైన రాఘవేంద్ర షిమోగాకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. యడియూరప్పను పక్కనబెట్టడం బీజేపీకి ప్రతికూలంగా మారింది.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారం మొదలైంది. అయితే ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత నళిన్ కుమార్ కటిల్ స్థానంలో విజేయంద్రకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కమలదళం నిర్ణయించింది. దీన్నిబట్టి కన్నడ నాట పార్టీపై యడియూరప్పకు, ఆయన కుటుంబానికి ఉన్న పట్టును బీజేపీ అంగీకరించిందని అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక బీజేపీ కొత్త అధ్యక్షుడు విజయేంద్ర ఫస్ట్ టార్గెట్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎక్కువ స్థానాల్లో గెలిపించడం. కర్ణాటకలో 28 లోక్ సభ స్థానాలు ఉండగా.. 2019 లోక్ సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 2024లో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే.. కర్ణాటకలో సత్తా చాటడం బీజేపీకి ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే యడియూరప్ప కుమారుడికి అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.


రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో విజయేంద్ర కాస్త తడబడినప్పటికీ.. తర్వాత సత్తా చాటుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. తండ్రి నీడ నుంచి బయటకొచ్చి తనదైన ముద్ర వేస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ రాజకీయాలు చేయొద్దనే కారణంతో వరుణ నుంచి సిద్ధరామయ్యపై విజయేంద్ర పోటీ చేయడానికి ఒప్పుకోని బీజేపీ అధిష్టానం.. ఇప్పుడు ఆయన చేతికే కర్ణాటక పార్టీ పగ్గాలు అప్పగించడం విశేషం. విజయేంద్ర తనను తాను నిరూపించుకుంటే.. భవిష్యత్తులో కర్ణాటక సీఎం పగ్గాలు కూడా ఆయన చేతికి అందే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa