ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్బు, ఆస్తులు సర్వం అయోధ్య రామాలయానికి ఇచ్చిన కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి

national |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 09:34 PM

మరికొన్ని రోజుల్లో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశం మొత్తం అయోధ్య రామాలయం వైపు చూస్తోంది. అయోధ్యలో రాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం కోట్లాది మంది హిందువులు వేచి చూస్తున్నారు. అయితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొత్తం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ క్రమంలోనే రామాలయ నిర్మాణం కోసం భక్తుల నుంచి విరాళాలు సేకరించింది. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ భారీ విరాళాన్ని ప్రకటించారు. తన జీవిత కాలంలో దాచుకున్న డబ్బుతోపాటు, తన ఆస్తి మొత్తాన్ని అయోధ్య ట్రస్ట్‌కు రాసి ఇచ్చారు.


అయితే నేరుగా డబ్బులు ఇవ్వకుండా బంగారం, వెండి, రాగి రూపంలో అయోధ్య రాముడికి సమర్పించనున్నారు. ఈ క్రమంలోనే 151 కిలోల బరువు ఉన్న రామ్ చరిత్ మానస్‌ను తయారు చేయించనున్నట్లు కేంద్ర హోం శాఖ మాజీ సెక్రటరీ ఎస్ లక్ష్మీ నారాయణన్ తెలిపారు. అయితే దాన్ని తయారు చేయించడానికి ఆయన వద్ద ఉన్న స్థిరాస్తులు, తన జీవిత కాలంలో సంపాదించిన మొత్తం డబ్బును అయోధ్య రాముడికి అర్పించనున్నారు. అయితే లక్ష్మీ నారాయణన్ మొత్తం ఆస్తులు రూ. 5 కోట్ల వరకు ఉంటుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.


అయితే భారీ రామ్‌చరిత్‌మానస్‌ను ముద్రించి.. దాన్ని రామాలయ గర్భగుడిలో రామ్ లల్లా ముందు ఉంచనున్నట్లు తెలిపారు. ఇందులో


10902 శ్లోకాలతో కూడిన ఈ రామ్‌చరిత్‌మానస్‌లోని ప్రతి పేజీ రాగితో తయారు చేయబడి ఉంటుందని చెప్పారు. ఇక ప్రతీ పేజీని 24 క్యారెట్ల బంగారంలో ముంచి వాటిపై అక్షరాలు చెక్కనున్నట్లు తెలిపారు. దీని కోసం 140 కిలోల రాగి, 7 కిలోల బంగారం అవసరం అవుతుందని తెలిపారు.


ఈ రామ్‌చరిత్‌మానస్‌ను ముద్రించేందుకు లక్ష్మీ నారాయణన్ తన ఆస్తులను అన్నింటినీ విక్రయించడంతోపాటు ఆయన బ్యాంకు ఖాతాల్లో ఇప్పటివరకు పొదుపు చేసిన మొత్తం డబ్బును ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అయోధ్యలో పర్యటించిన లక్ష్మీ నారాయణన్.. తాను రామ్‌చరిత్‌మానస్‌ను తయారు చేయించి దాన్ని రాముడి పాదాల ముందు ఉంచేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ నుంచి అనుమతిని కూడా తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రిటైర్ అయిన లక్ష్మీ నారాయణన్ తన సర్వీస్‌లో ఎన్నో కీలక బాధ్యతలను నిర్వర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa