విశాఖలో రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని సంగం శరత్ థియేటర్ కూడలి సమీపంలో పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. బుధవారం ఉదయం రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటోను వెనుకగా వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థులను స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన లారీ సుమారు 100 మీటర్ల దూరం వెళ్లి ఆగింది. లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విద్యార్థులందరు బేతని స్కూల్కి చెందిన వారిగా తెలుస్తోంది. విశాఖ పరిధిలోనే మరో ఘటన జరిగింది. మధురవాడ-నగరం పాలెం రోడ్డులో ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలయ్యాయి. మధురవాడ నుంచి నగరంపాలెం వైపు వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా.. వారందరూ స్వల్పంగా గాయపడ్డారు. వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa