మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్కిల్ డెవలెప్మెంట్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఐడీ సుప్రీంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రభావశీలమైన వ్యక్తి అని, తనతో సన్నిహితంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే దేశం విడిచిపోయేలా ఆయన ప్రోత్సహించినందున హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో కోరింది. ఈ కేసు దర్యాప్తునకు చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నందున బెయిల్ మంజూరు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. బెయిల్ కేసు విచారణలో హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించడంతోపాటు, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడంలో పూర్తిగా పొరబడిందని పేర్కొంది. తీర్పులో పేర్కొన్న అంశాలన్నీ రికార్డులకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి తెలిపారు. హైకోర్టు తీర్పు న్యాయసమ్మతం, చట్ట సమ్మతం కాదని.. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వటం దురదృష్టకరమన్నారు. స్కిల్ కేసులో అవకతవకలపై తగిన సాక్ష్యాధారాలు సమర్పించినా హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లి వ్యక్తం చేసిన అభిప్రాయాలు వాస్తవంగా తప్పు కావడంతోపాటు, అవి ట్రయల్ కోర్టుపై ప్రభావం చూపేలా ఉన్నాయన్నారు. మినీ ట్రయల్ నిర్వహించడం, మెరిట్స్పై అభిప్రాయాలు వ్యక్తం చేయడం ద్వారా హైకోర్టు తన పరిధిని ఉల్లంఘించిందన్నారు.
17ఏపై ప్రతి ఒక్కరూ న్యాయనిపుణుడేనని.. అక్కడే ట్రయల్, అక్కడే వాదనలు, అక్కడే తీర్పులు చెప్పి చెప్పి రాష్ట్రాన్ని హింసించారన్నారు. క్వాష్ పిటిషన్పై సుప్రీం కోర్టు తీర్పు వాయిదా వేసిందని,.. బెయిల్ పిటిషన్ అందులో ఉందని తాము హైకోర్టు న్యాయమూర్తికి చెప్పామన్నారు. ఆ అంశాన్ని తీర్పులో పేర్కొంటామని న్యాయమూర్తి అన్నారని.. కానీ తీర్పులో ఆ మాటే లేకపోవడం దురదృష్టకరమన్నారు. బెయిల్ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా హైకోర్టు దాని పరిధిని అతిక్రమించిందని పొన్నవోలు వ్యాఖ్యానించారు. సుప్రీంలో తమ కేసు డైరీ నంబర్ అయిందని.. దాని విధానం ప్రకారం అది విచారణకు వస్తుందన్నారు.
చంద్రబాబుకి బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ సమ్మతం, చట్ట సమ్మతం కాదన్నారు పొన్నవోలు సుధాకర్రెడ్డి. తాము కట్టలకొద్దీ సాక్ష్యాలు సమర్పించినా హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇది చాలా దురదృష్టకరమని.. ఇది ఎప్పుడూ రానటువంటి బెయిల్ ఉత్తర్వు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ, సీఐడీ విచారిస్తున్నాయని, ఛార్జిషీట్ వేసే వరకు అది కొనసాగుతూనే ఉంటుందన్నారు. 73 ఏళ్లు దాటిన వారు జైళ్లలో ఉండకూడదంటూ సీఆర్పీసీకి సవరణ చేసి పారేయండన్నారు. ఆ వ్యాధులు ఉన్న వారు జైళ్లలో ఉండకూడదని చట్ట సవరణ చేస్తే పోతుందన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa