అంతర్జాతీయ వేదికలపై భారత్పై లేనిపోని విమర్శలు చేసి పాక్ నవ్వుల పాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎన్నో సమావేశాల్లో అజెండాతో సంబంధం లేకుండా కాశ్మీర్ అంశాన్ని తీసుకువచ్చి.. భారత్ చేతిలో విమర్శలు పడుతూనే ఉన్నా బుద్ధి మార్చుకోవడం లేదు. అంతర్జాతీయ వేదికలపై ఏ అంశంపై సమావేశం జరిగినా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్ వైఖరిని చాలా సార్లు భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారత్లో అంతర్భాగం అని.. ఆ అంశం అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. పాక్ చేస్తున్న వైఖరిపై భారత్ ఘాటుగా స్పందించింది.
తాజాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన సమావేశంలో పాక్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని వినిపించింది. అంతర్జాతీయ శాంతి మరియు భద్రతా నిర్వహణపై బహిరంగ చర్చ జరిగింది. ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ ప్రస్తావించాడు. చైనా అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై భారత్ గట్టిగా బదులిచ్చింది. ఇది పాకిస్థాన్ అనవసరమైన, అలవాటైన పద్దతి అని భారత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత్పై వేరే దేశపు ప్రతినిధి చేసిన అనవసరమైన, అలవాటైన వ్యాఖ్యల్ని తోసిపుచ్చడానికి తాను ఏమాత్రం ఆలోచించనని చెప్పారు. సెకన్ల కంటే తక్కువ సమయంలోనే ఆ వ్యాఖ్యలను ఖండిస్తానని.. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత మిషన్ కౌన్సిలర్ ఆర్ మధు సూదన్ సోమవారం వెల్లడించారు.
జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. 2019 ఆగస్టు 5 వ తేదీన కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి నుంచి భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ వేదికలపై భారత్పై పాకిస్థాన్ తన అక్కసును వెల్లగక్కుతోంది. అయితే అది భారత అంతర్గత విషయమని భారత్ పదే పదే చెప్తున్నా పాకిస్థాన్ మాత్రం జోక్యం చేసుకుంటూనే ఉంది. ఇక పాకిస్థాన్తో సంబంధాల విషయంలో కూడా ఉగ్రవాదం, హింస లేని పాకిస్తాన్తో సాధారణ సంబంధాలను కోరుకుంటున్నామని భారత్ ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa