ఉత్తరాఖండ్లో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిపోయి 10 రోజులు దాటింది. అయితే అందులో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులకు ఆహారం, నీరు, ఆక్సిజన్ను పైపుల ద్వారా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎండోస్కోపీ కెమెరాను ఆ సొరంగంలోకి పంపించి అందులో ఉన్న కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ టన్నెల్లో ఉన్న కార్మికుడు తన తల్లికి పంపించిన మాటలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి 10 రోజులు దాటిపోయింది. అందులో కార్మికులు ఎలా ఉన్నారోనని వారి కుటుంబ సభ్యులే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొన్న వేళ.. కీలక సమాచారం వెల్లడైంది. 10 రోజుల తర్వాత సొరంగంలో అందులో చిక్కుకున్న కొందరు కార్మికులు వారి కుటుంబాలతో మాట్లాడారు. 6 అంగుళాల పైప్ను సొరంగంలోకి పంపించి.. అధికారులు కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఈ సందర్భంగానే ఆ టన్నెల్లో ఉన్న ఓ కార్మికుడు.. తన తల్లిదండ్రులకు ఒక ఎమోషనల్ మెసేజ్ పంపించాడు.
జైదేవ్ అనే కార్మికుడు తన తల్లికి పంపించిన ఆ మెసేజ్ విన్న వారి కంట కన్నీరు వచ్చేలా చేసింది. సొరంగం లోపల ఉన్న సూపర్వైజర్తో మాట్లాడుతుండగా.. బెంగాలీ భాషలో జైదేవ్ ఈ మాటలు మాట్లాడాడు. దయచేసి తాను మాట్లాడే మాటలు రికార్డ్ చేయండని అధికారులను కోరాడు. తాను తన తల్లికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని చెప్పాడు. "అమ్మ.. నా గురించి, నా ఆరోగ్యం ఎలాంటి భయాలు పెట్టుకోకండి.. సొరంగంలో నేను బాగానే ఉన్నాను. నువ్వు, నాన్న సమయానికి ఆహారం తీసుకోండి” అని జైదేవ్ చెప్పడం అందులో ఉంది. ఈ క్రమంలోనే సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మాటలను రికార్డ్ చేసి.. వాయిస్ రికార్డింగ్లను వారి కుటుంబాలకు పంపుతున్నారు.
సొరంగం తవ్వే సమయంలో కూలడంతో 41 మంది కూలీలు చిక్కుకున్నారు. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్నాల్డ్ డిక్స్ రంగంలోకి దిగి టన్నెల్ కూలిన ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న కూలీల వీడియోను అధికారులు తొలిసారిగా విడుదల చేశారు. అయితే సొరంగంలో ఉన్న కార్మికులు సురక్షితంగా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. 41 మంది కూలీలను రక్షించేందుకు జమ్మూ కాశ్మీర్ బజరంగ్ దళ్ హవాన్ నిర్వహించింది. వారికి 6 అంగుళాల పైపుల ద్వారా గంజి, కిచిడీ పంపించారు. అంతకుముందు డ్రైఫ్రూట్స్, మందులు, నీరు, ఆక్సిజన్ను 4 అంగుళాల పైపుల ద్వారా అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa