ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్‌డౌన్ కంటే కొందరు చనిపోవడమే మంచిది.. కరోనాపై రిషి సునాక్

international |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2023, 12:03 AM

బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన రిషి సునాక్.. అప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2019 లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి, దాన్ని అదుపు చేసేందుకు విధించిన లాక్‌డౌన్ గురించి.. ఆ సమయంలో రిషి సునాక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బయటికి రావడం పెను దుమారానికి కారణం అయింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బ్రిటన్‌లో తీవ్ర విమర్శలకు దారి తీసింది.


ప్రపంచం అంతా కరోనా వైరస్ మహమ్మారితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వేళ.. బ్రిటన్‌లో కూడా పరిస్థితి భయంకరంగా ఉంది. అయితే అప్పటికే ఒకసారి వైరస్ కట్టడికి బ్రిటన్ సర్కార్ లాక్‌డౌన్ విధించింది. తర్వాత మరోసారి కూడా కొవిడ్ విజృంభించడంతో మళ్లీ లాక్‌డౌన్ విధించాలా వద్దా అనేది ప్రభుత్వం, అధికారులు భేటీ అయి సమాలోచనలు జరిపారు. ఆ సమయంలో రెండోసారి లాక్‌డౌన్ విధించడం కంటే కొంతమందిని చనిపోవడానికి అనుమతించడమే మంచిదని రిషి సునాక్ అన్నట్లు పలు మీడియా కథనాలు వెలువడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


అయితే కొవిడ్ 19 సమయంలో జరిగిన ఈ విషయాన్ని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అత్యంత సీనియర్ సలహాదారు డొమినిక్ కమ్మింగ్స్ తెలిపారు. మాజీ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ పాట్రిక్ వాలెన్స్ ఆ సమయంలో రాసుకున్న డైరీ ప్రకారం.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలా వద్దా అనే విషయంపై జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేసినట్లు రాయిటర్స్ వార్తా కథనం తెలిపింది. కరోనా సమయంలో బ్రిటన్ మొత్తం లాక్‌డౌన్ విధించాలా వద్దా అని డొమినిక్ కమ్మిన్స్ అడిగినపుడు లాక్‌డౌన్ విధించడం కంటే కొవిడ్ కారణంగా కొంతమందిని చనిపోవడానికి అనుమతించడం మంచిదని రిషి సునాక్ అన్నారని పేర్కొన్నారు.


అయితే ఈ సమావేశం 2020 మే 4 వ తేదీన జరిగినట్లు పాట్రిక్ వాలెన్స్ ప్రస్తావించారు. రిషి సునాక్ అప్పుడు చేసిన ప్రకటన బయటికి రావడంతో బ్రిటిష్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ వ్యవహారంపై ప్రధాని రిషి సునక్ అధికార ప్రతినిధి స్పందించారు. ఆ ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను బయటపెట్టిన తర్వాతే ప్రధాని దీనిపై ప్రకటన చేస్తారని తెలిపింది. ఇక 2019లో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి బ్రిటన్‌లో 2.2 లక్షల మందికి పైగా మరణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa