మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మద్యం విషయంలో సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ లైసెన్సుల విషయంలో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి, కమిషనర్ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఫైలును ఆర్థిక శాఖకు పంపకపోవడాన్ని సీఐడీ ఆక్షేపించడం సరికాదని.. ఈ విషయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాలన్నారు. అందుకు అప్పటి సీఎం, మంత్రిని బాధ్యులను చేయడం సరికాదన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు ఆధారంగా తెదేపా అధినేత చంద్రబాబు, అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ కమిషనర్పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు, రవీంద్ర పిటిషన్లు దాఖలు చేశారు. ప్రివిలేజ్ ఫీజు తొలగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగినట్లు 2021లో కాగ్ వెలువరించిన తుది నివేదికలో పేర్కొనలేదన్నారు. 2019 కాగ్ ముసాయిదా నివేదికలోని అంశాలను చూపుతూ సీఐడీ కోర్టును తప్పుదోవ పట్టిస్తోందన్నారు చంద్రబాబు తరఫు లాయర్లు.
ఎస్పీవై ఆగ్రోస్ సంస్థ విడతల వారీగా లైసెన్స్ ఫీజు బకాయిలు చెల్లించేందుకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం ఉందన్నారు. పిటిషనర్పై రాజకీయ ప్రతీకారంతో గత నెలన్నరలో ఆరు కేసులు నమోదు చేశారని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ నుంచి మార్చి 2015 మధ్య తొమ్మిది నెలల కాలానికి ప్రివిలేజ్ ఫీజు రూపంలో రూ.11 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 2015-17 మధ్య మూడేళ్లకు ప్రివిలేజ్ ఫీజును తొలగించడం ద్వారా రూ.1500 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు సీఐడీ చేస్తున్న వాదన సరికాదన్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తరఫున కూడా లాయర్ వాదనలు వినిపించారు.పిటిషనర్పై కేసు నమోదు చేయాలంటే అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. ప్రస్తుత కేసు విషయంలో అలా చేయలేదని.. బెయిలు మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వ నిర్ణయంతో మద్యం దుకాణాలు, బార్ లైసెన్స్ యజమానులు అనుచిత లబ్ధి పొందారని సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున పిటిషనర్లకు బెయిలు ఇవ్వొద్దని కోరారు. అయితే కోర్టులో తెలిపిన వివరాలను రాతపూర్వకంగా కోర్టు ముందుంచాలని పిటిషనర్లకు న్యాయమూర్తి సూచించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
రాష్ట్రంలోని రెండు బ్రూవరీస్, మూడు డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని రాష్ట్ర బ్రూవరీస్ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు, రవీంద్ర వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa