దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం (టన్నెల్) ఫాల్ట్ జోన్లో పనులు అసాధ్యమని నాడు చంద్రబాబు చేతులెత్తేయగా నేడు ముఖ్యమంత్రి జగన్ దాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానం తో పూర్తి చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ను ముఖ్యమంత్రి జగన్ గురువారం జాతికి అంకితం చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa