అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం చక్కగా నిర్వహిస్తున్నారని.. తాము కూడా ఇందులో పాల్గొన్నామని తిరుపతికి చెందిన ఈశ్వర్ అనే భక్తుడు సంతోషం వ్యక్తం చేశారు. తిరువణ్ణామలై, మథురలో ఒక కొండ మాత్రమే ఉందని.. తిరుమలలో సప్తగిరులు ఉన్నాయి కావున ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేందుకు ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని ఈవో .ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలిచ్చారు.
తిరుమల కొండల చుట్టూ గిరిప్రదక్షిణ చేసే అవకాశం కల్పించాలని భక్తుడు కోరారు. తిరుమలలో ఒకే కొండ విడిగా లేదు. కావున గిరిప్రదక్షిణ చేసే అవకాశం లేదన్నారు ఈవో ధర్మారెడ్డి. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులో ఆలయ ప్రదక్షిణ చేయవచ్చని సలహా ఇచ్చారు. భక్తులు టీటీడీ కాల్సెంటర్కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని.. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా కూడా టీటీడీ అధికారులను సంప్రదించి సూచనలు, సలహాలు ఇవ్వవచ్చన్నారు. ట్విట్టర్ ద్వారా కూడా సమాచారం అందించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.
తిరుమలలో వడ ప్రసాదం పరిమితంగా తయారు చేస్తారన్నారు ఈవో.. వడలు భక్తులకు సక్రమంగా అందేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులందరూ సంప్రదాయ వస్త్రధారణ పాటించేలా సూచనలు ఇస్తామని.. శ్రీవారి సేవకుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే అక్కడున్న అధికారులకు ఫిర్యాదు చేస్తే.. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దర్శన టికెట్ల కోసమే ఎక్కువ మంది భక్తులు నడక మార్గంలో నడిచి వస్తున్నారన్నారు. ఇటీవల క్రూరమృగాల దాడులు జరగడంతో తప్పనిసరిగా నడిచిరావాలనే నిబంధన తొలగించి తిరుపతి భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు కేటాయిస్తున్నామన్నారు.
శ్రీవారి దర్శనానికి ఏటీసీ సర్కిల్ నుంచి వస్తే.. ఒకటిన్నర కిలోమీటరు దూరం నడిపించి తిరిగి అదే సర్కిల్ కు తీసుకొచ్చారని.. దీనివల్ల పిల్లలు, వృద్దులు చాలా ఇబ్బందిపడ్డారని ఓ భక్తుడు ఈవోకు ఫిర్యాదు చేశారు. అలా జరిగే అవకాశం లేదని.. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రహోమం) శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుండి 11వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేషదీపారాధన, హారతి ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa