పార్లమెంట్లో జరిగిన స్మోక్ దాడి ఘటన యావత్ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను దాటి నిందితులు.. టియర్ గ్యాస్ క్యాన్లను తీసుకురావడంతో భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐదు అంచెల భద్రత ఉండే కొత్త పార్లమెంట్ భవనంలోకి రావడం భారీ భద్రతా వైఫల్యమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఈ దాడిలో నలుగురు పాల్గొన్నట్టు తొలుత పోలీసులు వెల్లడించారు. కానీ, ఇందులో మొత్తం ఆరుగురు పాల్గొన్నట్టు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. లోక్సభ విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న యువకులు సాగర్ శర్మ, మనో రంజన్లు ఛాంబర్లోకి దూకి కలర్ స్మోక్ స్ప్రే చేశారు. ఇదే సమయంలో పార్లమెంట్ బయట ఉన్న అమోల్ షిండే, నీలం దేవి కౌల్లు ఎరుపు, పసుపు రంగు క్యానన్లు స్ప్రే చేసి, రాజ్యాంగాన్ని రక్షించాలి, భారత్ మాతాకీ జై అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ పరుగెత్తారు. వీరితో పాటు గురుగ్రామ్కు చెందిన లలిత్ ఝా, విక్కీ శర్మలు కూడా పాల్గొన్నట్టు పోలీసులు చెప్పారు. లలిత్ ఝా ఇంటిలోనే వీరంతా బస చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకూ ఐదుగుర్ని అరెస్ట్ చేశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. సాగర్ శర్మ స్వస్థలం యూపీలోని లక్నో కాగా.. మనో రంజన్ మైసూర్. అమోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్, నీలం దేవి హరియాణాలోని హిస్సార్కు చెందినవారిగా గుర్తించారు. వీరికి ఆన్లైన్లోనే పరిచయం ఏర్పడిందని, పక్కా ప్లాన్తోనే పార్లమెంట్లో అలజడి సృష్టించారని పోలీసులు తెలిపారు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సిన్హా పాస్లతోనే పార్లమెంట్లోకి వచ్చినట్టు వివరించారు. ఇక, నీలం దేవి (42) సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టి ఆందోళనల్లో పాల్గొంది. కానీ, ఏ రాజకీయ పార్టీతో ఆమెకు సంబంధం లేదని నీలం దేవి సోదరుడు చెప్పారు. కాగా, సరిగ్గా 22 ఏళ్ల కిందట ఇదే రోజున పాకిస్థాన్ ఉగ్రవాదులు పార్లమెంట్పై దాడికి ప్రయత్నించారు. లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రమూకల దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో 9 మంది జవాన్లు అమరులయ్యారు. వారి సంస్మరణ సభ ముగిసిన కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా, గతవారం ఖలీస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ పార్లమెంట్ను పునాదులతో సహా కదలిస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే, ఈ బెదిరింపులను ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్టు లేదని తాజా ఘటనతో రుజువైందనే విమర్శ వినిపిస్తోంది. దేశానికి గుండెకాయ వంటి పార్లమెంట్ భవనంలో ఇలాంటి ఘటనలు జరగడం ప్రజాప్రతినిధులకు సురక్షితమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa