ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఇకపై అక్కడ దర్శన టికెట్లు ఇవ్వరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2023, 06:58 PM

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. దేశ విదేశాల నుండి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే విమాన ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో ప్ర‌తి రోజు 100 ఆఫ్‌లైన్‌ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే విమానాశ్రయంలో శ్రీ‌వాణి టికెట్ల జారీకి అనుమ‌తి లేని కార‌ణంగా.. నేటి నుంచి (డిసెంబ‌రు 16వ తేదీ శ‌నివారం నుంచి) విమానాశ్రయంకు బ‌దులుగా తిరుమ‌ల గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో జారీ చేస్తారు. ప్ర‌తి రోజు 100 టికెట్ల‌ను బోర్డింగ్ పాస్ స‌మ‌ర్పించిన భ‌క్తుల‌కు య‌ధావిధిగా శ్రీ‌వాణి ద‌ర్శ‌న ఆఫ్‌లైన్ టికెట్ల‌ను ఇస్తారని టీటీడీ తెలిపింది. కావున భక్తులు విమానాశ్రయంలో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ కౌంటర్ మార్పును గమనించాలని కోరారు.


తిరుమలలోని గోకులం కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్ల జారీ చేస్తారు. ఈ ఏడాది మార్చి నుంచి 1000 శ్రీవాణి టిక్కెట్లలో.. 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంచారు. టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేశారు. ఇప్పుడు ఎయిర్‌పోర్టు నుంచి కౌంటర్‌ను గోకులంకు మార్చారు. అంటే అక్కడే 100 టికెట్లను జారీ చేస్తారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 17వ తేదీన తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 135వ జ‌యంతి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 8.30 గంటలకు శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం ఉంటుంది. అనంత‌రం ఉదయం 9 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో సభా కార్యక్రమం నిర్వహిస్తారు.


మరోవైపు తిరుమలను పొగమంచు కమ్మేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొగమంచు, తేలికపాటి జల్లులతో తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. కొండపై చలితీవ్రత బాగా పెరిగింది.. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు వర్షంలో తడుస్తూ గదులకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకస్మాత్తుగా తిరుమలలో రద్దీ కూడా పెరగడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. దట్టమైన పొగమంచు కారణంగా ఘాట్‌రోడ్లలో వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. పొగమంచు, వర్తోషం సొంత వాహనాల్లో ఘాట్‌రోడ్డులో ప్రయాణించే వారిని అలిపిరి దగ్గర టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఘాట్‌రోడ్లలో మరమ్మతు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా వెళ్లాలని సూచిస్తున్నారు. పొగమంచు, వర్షం కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను తాత్కాలికంగా తితిదే మూసివేసింది. ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలను శుక్రవారం సాయంత్రం నుంచి నిలిపివేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa