ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.25 కే కిలో బియ్యం.. కేంద్రం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 27, 2023, 08:07 PM

దేశంలో గత కొన్ని రోజులుగా బియ్యం ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. మొదట బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. ఆ తర్వాత అన్ని రకాల బియ్యాన్ని ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధించింది. ఆ తర్వాత కొన్ని ఆంక్షలను సడలించినా బియ్యం ధరలు మాత్రం మునుపటి స్థాయికి చేరుకోలేదు. ఈ నేపథ్యంలోనే దేశంలో మరికొన్ని రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బియ్యం ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీ కింద రూ.25 కే కిలో బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.


భారత్ రైస్ పేరుతో రూ.25 కే కిలో బియ్యాన్ని అందించేలా కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే గోధుమ పిండి, ప‌ప్పు ధాన్యాల‌ను ప్ర‌జ‌ల‌కు భార‌త్ ఆటా, భార‌త్ దాల్ పేరిట రాయితీ ధ‌ర‌ల‌కే కేంద్రం ఇప్ప‌టికే అందిస్తోంది. ఈ క్రమంలోనే బియ్యం ధరలు పెరిగిపోవడంతో భారత్ రైస్ పేరిట బియ్యాన్ని అందించాలని నిర్ణయించింది. అయితే అందుకోసం నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా -నాఫెడ్, నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ - ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్ అవుట్‌లెట్ల ద్వారా రూ.25 కే కిలో బియ్యాన్ని విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశంలో స‌గ‌టున కిలో బియ్యం ధ‌ర‌ రూ. 44 కు చేర‌డంతో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని క‌ట్ట‌డి చేసేందుకు భార‌త్ రైస్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.


మరోవైపు.. భారత్ ఆటా, భారత్ దాల్ పేరిట తక్కువ ధరకే కేంద్ర ప్రభుత్వం గోధుమ పిండి, శనగ పప్పును సామాన్య ప్రజలకు విక్రయిస్తోంది. కిలో గోధుమ పిండి రూ. 27.50, కిలో శ‌న‌గ పప్పు రూ. 60 కి అందిస్తోంది. ఈ భారత్, ఆటా, భారత్ దాల్‌ను దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా రిటైల్ కేంద్రాల్లో విక్ర‌యిస్తున్నారు. వీటి లాగానే భార‌త్ రైస్‌ను కూడా విక్రయిస్తూ బియ్యం ధ‌ర‌లను అదుపులో ఉంచాల‌ని కేంద్రం భావిస్తోంది. ఇక ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కూడా దేశీయ మార్కెట్‌లో బియ్యం ల‌భ్య‌త‌ను పెంచేందుకు ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద రైస్‌ను ఆఫ‌ర్ చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa