పొగమంచు ఢిల్లీని అతలాకుతలం చేసింది. మొన్నటివరకు తీవ్ర వాయు కాలుష్యంతో విలవిలలాడిన ఢిల్లీ.. ప్రస్తుతం చలితో వణుకుతోంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో నగర వాసులు వణికిపోతున్నారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా చీకట్లు అలుముకున్నాయి. దీంతో ఉదయం కూడా వాహనాలు లైట్లు వేసుకునే వెళ్లాల్సి వస్తోంది. ఒకవైపు తీవ్రమైన చలి, మరోవైపు పొగమంచు కప్పేయడంతో బయటికి రావాలంటేనే ఢిల్లీ వాసులు బెంబేలెత్తుతున్నారు. ఇక ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే విమానాలు, రైళ్ల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది.
ఢిల్లీలో చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించకుండా మంచు కమ్మేసింది. ఇక పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 110 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలు ఆలస్యం అయినట్లు ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. ఇక ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించి ఇతర నగరాల్లో ల్యాండ్ చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రైళ్ల రాకపోకలపైనా కూడా పొగమంచు ప్రభావం పడింది. ఢిల్లీకి రావాల్సిన దాదాపు 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఉత్తర రైల్వే తెలిపింది.
ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ఉత్తర భారతదేశం మొత్తం చలిగాలులు వీస్తున్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉదయం 5:15 గంటల సమయంలో పొగమంచు వేగంగా వ్యాపిస్తున్నట్లు ఉన్న శాటిలైట్ ఫోటోను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఇక పొగమంచు భారీగా కప్పేయడంతో రోడ్లపై వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa