ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.0.. సంక్రాంతి నుంచి 14 రాష్ట్రాల్లో 6 వేల కిలోమీటర్లు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 27, 2023, 08:38 PM

భారత్ జోడో యాత్రతో నాయకుడిగా తనలో పరిణతిని సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. 2024 సార్వత్రిక ఎన్నికల వేళ మరో యాత్ర చేయనున్నారు. ఈసారి భారత్ జోడో యాత్రకు పేరు మార్చిన హస్తం పార్టీ.. భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేసింది. ఈ సంక్రాంతికి ప్రారంభం కానున్న భారత్ న్యాయ యాత్ర.. 14 రాష్ట్రాల్లో కొనసాగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ భారత్ న్యాయ యాత్రలో భాగంగా మొత్తం 6 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసింది అనుకున్న తరుణంలో చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో ఈసారి భారత్ న్యాయ యాత్ర ఉంటుందని హస్తం పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


ఈ భారత్ న్యాయ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు కొనసాగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ప్రారంభం కానుంది. 14 రాష్ట్రాల మీదుగా 6,200 కిలోమీటర్లు 75 రోజుల పాటు జరగనుంది. 85 జిల్లాల్లో సభలు నిర్వహించనున్న రాహుల్ గాంధీ.. మార్చి 30 వ తేదీన ముంబైకి చేరుకుని అక్కడ ఈ భారత న్యాయ యాత్రను ముగించనున్నారు. అయితే గతంలో భారత్ జోడో యాత్రగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి దానికి పేరు మార్చి భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేసింది. ఇది దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం చేపట్టబోతున్న యాత్ర అని.. అందుకే భారత్ న్యాయ యాత్రగా పేరు మార్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.


గతేడాది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4 వేల కిలోమీటర్లకు పైగా దూరం పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ భారత న్యాయ యాత్రలో కేవలం నడవటం మాత్రమే కాకుండా.. మధ్యలో బస్సులో ప్రయాణించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మణిపూర్ నుంచి ముంబై వరకు ఉన్న 6,200 కిలోమీటర్ల మార్గంలో కొంత భాగం కొండ ప్రాంతాలు ఉన్నాయని.. ఇక్కడ వేలాది మంది జనంతో పాదయాత్ర చేయటం సాధ్యం కాదు కాబట్టి.. ఆయా ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది.గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించగా.. ఈ యాత్ర కూడా అలాగే సాగుతుందని హస్తం వర్గాలు చెప్పాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa