ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం సంచలన నిర్ణయం.. ప్రభుత్వ శాఖల్లో పెట్రోల్, డీజిల్ వాహనాల కొనుగోలు బంద్

national |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 09:07 PM

వాయు కాలుష్యం నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం.. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడం వంటివి చేస్తూనే ఉంటాయి. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సుఖ్వీందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ శాఖల్లో అవసరమైన వాహనాల కొనుగోళ్లలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను కొనుగోలు చేయడంపై నిషేధం విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు వెల్లడించారు.


ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సంప్రదాయంగా పెట్రోల్, డీజిల్‌లతో నడిచే వాహనాల కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలేవీ కూడా 2024 జనవరి 1 వ తేదీ నుంచి డీజిల్, పెట్రోల్‌లతో నడిచే వాహనాలను కొనుగోలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తుంది. దీంతోపాటు ‘గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్’ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ శాఖలు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కొనాలంటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తప్పనిసరిగా ఉండాలని షరతులు విధించారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య 185గా ఉందని.. అదే ప్రైవేట్ ఎలక్ట్రిక్‌ వాహనాలు 2733 గా ఉన్నాయని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు.


ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారంతో స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ అనే సంస్థ ఏటా వాయు ప్రమాణాలను అధ్యయనం చేస్తోంది. దాని ఆధారంగా ప్రపంచ వాయు నాణ్యత నివేదికను రూపొందిస్తుంది. ఈ ఏడాది మార్చిలో వెలువరించిన నివేదికలో ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత దేశాల జాబితాలో భారత్‌ 8 వ స్థానంలో నిలిచింది. దీంతో దేశంలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa