ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో అస్పత్రిలో మృతి.. అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా లేచి కూర్చుంది

national |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 09:08 PM

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన మహిళను అంబులెన్స్లో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో లేచి కూర్చుని, పక్కనే ఉన్న భర్తను నీరు ఇవ్వమని అడిగింది. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హమీర్‌పుర్ జిల్లా‌లో మూడు రోజుల కిందట చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సదర్ గ్రామానికి చెందిన మతాదిన్ రక్వార్ భార్య అనిత (33).. అనారోగ్యంతో పంజాబ్‌లోని జలంధర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరింది. బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో అనిత మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుని మతాదికన్ హమీర్‌పూర్‌లోని తమ స్వగ్రామానికి బయలుదేరారు.


అయితే, అంబులెన్స్ నొయిడా సమీపానికి వచ్చేసరికి భార్య తనను పిలిచినట్టు మతాదికన్‌కు వినిపించింది. దీంతో భర్త ఆమె ముఖంపై నుంచి కవరు తొలగించి చూసేసరికి ఆమె కళ్లు తెరిచి ఉంది. తనకు నీళ్లు కావాలని అడిగింది. దీంతో అతడు సహా అందులో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. చనిపోయిందని వైద్యులు ప్రకటించినా.. ఆమె తిరిగి ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసి చుట్టుపక్కలవారు అనితను చూసేందుకు తరలివస్తున్నారు.


అనిత భర్త మతాదికన్ రక్వాన్ మాట్లాడుతూ. తన భార్యకు చికిత్స కోసం భోపాల్, అమృత్‌సర్‌లలోని ప్రముఖ ఆస్పత్రులకు తీసుకెళ్లానని చెప్పాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తరుచూ తిరగడం ఇబ్బందిగా మారడంతో జలంధర్‌లోని తమ బంధువు రాజు ఇంటికి వచ్చేశామని అన్నాడు. అక్కడే అనితకు చికిత్స చేయించామని వివరించాడు. ‘దాదాపు రెండు వారాల కిందట అనిత ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని, రాత్రికి రాత్రి రూ.20 వేలు కట్టించుకున్నారు.. ఆ మర్నాడు ఉదయం రూ.60,000 డిపాజిట్ చేయమన్నారు.. అయితే, కొద్ది గంటల తర్వాత అనిత చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు’ అని తెలిపాడు. ‘అంత్యక్రియల కోసం తమ స్వగ్రామానికి అంబులెన్స్‌లో తీసుకెళ్తామని ఆస్పత్రికి సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని అప్పగించారు.. రూ.30 వేలకు ఓ ప్రయివేట్ అంబులెన్స్ మాట్లాడుకుని బయలుదేరాం.. నొయిడా దగ్గరకు వచ్చేసరికి సడెన్‌గా అనిత కళ్లుతెరిచి, దాహంగా ఉందని నీళ్లు ఇవ్వమని అడగటంతో నేను ఆశ్చర్యపోయాను’ అని రక్వార్ చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa