ట్రెండింగ్
Epaper    English    தமிழ்

31 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు.. పోలీసులకు పట్టించిన భార్య సెల్‌ఫోన్ !

national |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 09:11 PM

హత్య కేసులో నిందితుడిగా ఉండి.. 31 ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని అరెస్టు చేశారు. 31 ఏళ్ల క్రితం ఓ హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి బెయిల్ లభించింది. అయితే బెయిల్‌పై బయటికి వచ్చిన ఆ నిందితుడు మళ్లీ జైలుకు వెళ్లకుండా పోలీసులకు లొంగిపోకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అప్పటి నుంచి పోలీసులు వెతికినా అసలే దొరకలేదు. అయినా ఆ కేసును వదిలిపెట్టని పోలీసులు.. చివరికి 31 ఏళ్ల తర్వాత ఆ నిందితుడిని పట్టుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగుచూసింది.


ముంబై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 1989 లో ఒక హత్య జరిగింది. అయితే ఆ హత్య కేసులో దీపక్‌ నారాయణ్‌ భీసే (62)ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా.. కోర్టు అతన్ని రిమాండ్‌కు తరలించారు. అయితే ఆ వ్యక్తికి 1992 లో బెయిల్ మంజూరు కావడంతో బయటికి వచ్చాడు. కానీ ఆ అప్పటినుంచి దీపక్ నారాయణ్ భీసే కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే 2003 లో కోర్టు దీపక్ నారాయణ్‌ను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించింది. ఈ క్రమంలోనే అతడి ఆచూకీ కనిపెట్టాలని ముంబై పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.


ముంబైలోని కాందివలీ ప్రాంతంలో దీపక్ నారాయణ్ భీసే నివసించేవాడు. దీంతో అప్పుడప్పుడూ అతని కోసం పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ జరిపేవారు. అయితే ఆ నిందితుడు అక్కడ ఉండటం లేదని స్థానికులు పోలీసులకు చెప్పేవారు. ఈ క్రమంలోనే దీపక్ నారాయణ్ చనిపోయి ఉండవచ్చని పోలీసులకు చెప్పేవారు. అయినప్పటికీ పోలీసులు ఆ కేసును వదిలేయకుండా దర్యాప్తు చేస్తూనే ఉండేవారు. ఈ క్రమంలోనే ఇటీవల దీపక్ నారాయణ్ భీసే భార్య ఫోన్ నంబర్‌ను పోలీసులు సంపాదించారు.


ఆ ఫోన్‌ నంబర్‌ను ట్రాక్‌ చేసి.. నాలాసొపారా ప్రాంతంలో నిందితుడిని వల వేసి పట్టుకున్నారు. 3 దశాబ్దాలకు పైగా అనేక ప్రాంతాలని మార్చుతూ దీపక్ నారాయణ్ భీసే తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రెండేళ్లుగా ఆ ప్రాంతంలో స్థిరపడినట్లు గుర్తించారు. చెట్ల నరికివేత పనులు చేపడుతూ దీపక్ నారాయణ్ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని ప్రస్తుతం జైలుకు తరలించామని.. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa