నకిలీ ఓట్ల తొలగింపు వ్యవహారంపై అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఒకేసారి నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రగిరిలో నమోదైన నకిలీ ఓట్లు తొలగించాలని తిరుపతి గ్రామీణం ఆర్డీవో కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. వారికి పోటీగా వైఎస్ఆర్సీపీ నాయకులు, దళితులతో కలిసి అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఇరు పార్టీల నేతలూ పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చంద్రగిరి నియోజకవర్గం ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ ఇంఛార్జి పులవర్తి నాని నాయకత్వంలో ఆ పార్టీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ క్రమంలో పలువురు అధికార పార్టీ నేతలు దళితులకు ఓటు హక్కు కల్పించాలంటూ అక్కడకు చేరుకొని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఒకేసారి రెండు పార్టీలకు చెందిన నేతలు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ, వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ పులివర్తి నాని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆయనను అరెస్ట్ చేశారు. ఆర్డీవో స్పందించి బోగస్ ఓట్లను రద్దు చేసేంత వరకు దీక్ష విరమించబోయేది లేదని ఆయన తెగేసి చెప్పారు. ఓటర్ల జాబితాపై ఇంత నిర్లక్ష్యమేంటని? గత 7 నెలలుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచనలతోనే భారీగా బోగస్ ఓట్లు నమోదవుతున్నాయని, ఆధారాలు సమర్పించి చర్యలు తీసుకోండని కోరుతున్నా స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే చెవిరెడ్డి దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని మండిపడ్డారు. ఓట్లతోనే వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa