ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమండ్రిలో ఉండవల్లి, హర్షతో లగడపాటి రాజగోపాల్ భేటీ.. ఎన్నికల్లో పోటీపై క్లారిటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 06:51 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేత లగడపాటి రాజగోపాల్.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ.. మరోసారి తెరపైకి వచ్చారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ మాజీ ఎంపీలతో సమావేశం అయ్యారు.. కాంగ్రెస్ పార్టీ ఏపీలో మరోసారి యాక్టివ్ అవుతున్న సమయంలో ఇద్దరి భేటీ చర్చనీయాంశం అయ్యింది. లగడపాటి రాజగోపాల్ రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌‌, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌లను కలిశారు.. వీరితో లగడపాటి భేటీకావడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన రాజగోపాల్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో మళ్లీ పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. నాలుగైదు నెలల క్రితం లగడపాటి మళ్లీ పోటీచేస్తారని చర్చ జరిగింది.. ఆయన మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే హర్షకుమార్‌ను కలిసిన సమయంలో ఏపీలో రాజకీయాలపై రాజగోపాల్ స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు కూడా నిర్వహించడం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిపోయిందన్నారు. ఏపీలో కూడా తమిళనాడు తరహాలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల మధ్యే పోటీ ఉంటుందన్నారు. రాజమండ్రి వచ్చిన సమయంలో హర్షకుమార్, ఉండవల్లిని కలవడం మామూలే అన్నారు.


కాంగ్రెస్ హయాంలో లగడపాటి, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌లు ఎంపీలుగా పనిచేశారు. రాజగోపాల్ విజయవాడ ఎంపీగా.. హర్షకుమార్ అమలాపురం ఎంపీగా.. ఉండవల్లి రాజమండ్రి ఎంపీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ నేతలు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. వీరిలో హర్షకుమార్ మాత్రం 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు.. కానీ టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినా పెద్దగా యాక్టివ్‌గా లేరు.. అలాగే ఏపీ కాంగ్రెస్ కమిటీ నియాకాల్లో అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారు. అక్కడితో ఆగకుండా ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఘాటుగా స్పందించారు హర్షకుమార్. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది YS కుటుంబానికి ఊడిగం చేయడానికే? అంటూ ప్రశ్నించారు. హర్షకుమార్ కూడా ఇటీవల కాలంలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తన అనుచరులు, అభిమానులతో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దళిత సింహ గర్జన పేరతో ఫిబ్రవరి 8న రాజమండ్రి వేమగిరి ప్రాంతంలో.. సుమారు పది లక్షల మందితో సభను ఏర్పాటు చేశారు. దళితుల ఆత్మగౌరవం , రాజ్యాధికారం,వివక్ష రాజకీయాలలో చిన్న చూపు, 27 పథకాలు తీసివేత, దళితుల మీద అత్యాచారాలు, దాడుల మీద సమర నాదం నినాదాలతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో లగడపాటి, హర్షకుమార్‌ల భేటీ ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నేతలు మర్యాదపూర్వకంగానే కలిశారనే మరో చర్చ జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa