ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎస్సీ మహిళను కాబట్టే.. మీ కాళ్లు పట్టుకోవాలా': వైసీపీ మహిళా ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 07:19 PM

అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా పద్మావతి తన ఆవేదనను వ్యక్తం చేశారు. రైతాంగానికి తమ వాటా నీరు తీసుకోవాలంటే ప్రతిసారి ఒక రకమైన యుద్ధమే చేయాల్సి వస్తోందన్నారు. ఇక్కడి రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే కుప్పానికి తీసుకెళ్తున్నారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా.. చూస్తాం చేస్తాం అని చెప్పడం తప్పితే.. సమస్యను పరిష్కరించింది లేదన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు ఎలా అడగాలంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం హయాంలో ఎస్సీలకే ఎందుకు అంత అన్యాయం జరుగుతోందని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని ఉండాలా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలా అయితే నియోజకవర్గానికి నిధులు విడుదల చేస్తారా? అని ప్రశ్నించారు. ఒక్క రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఓట్లు వేస్తే తాను ఎమ్మెల్యే కాలేదని.. కులాలకు, మతాలకు అతీతంగా తనను శింగనమల ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు.


ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు పద్మావతి. శింగనమల తమ నియోజకవర్గం నుంచి కాలువలు వెళ్తున్నా.. తమ ప్రాంతం వారికి మాత్రం నీరు అందడంలేదన్నారు. ఐఏబీ మీటింగ్ లో కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు.. నీళ్లు కావాలంటే సీఎం ఆఫీస్‌కి వెళ్లాలా అంటూ ప్రశ్నించారు. అందరికీ అణిగిమణిగి ఉండాలా..? నీళ్లకోసం మాట్లాడితే పెద్ద నేరమా..? అన్నారు. ఎస్సీ మహిళ కాబట్టి నోరు తెరిచి మాట్లాడకూడదా.. ఐదేళ్లుగా తనను ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు. జిల్లా నేతలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా, ఇరిగేషన్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని.. కనీసం ఒక్క చెరువుకు నీరు విడుదల చేయాలని అడిగితే కూడా జిల్లా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


వరదలొస్తేనే నీళ్లు ఇస్తారా.. ఒక కులం, ఒక నియోజకవర్గానికే అన్నీ సమకూరుస్తారా? అన్నారు నీటి కోసం ఎన్నేళ్లు ఇలా పోరాటం చేయాలి?.. ప్రశ్నిస్తే పెద్ద నేరంగా భావిస్తారా? ఐదేళ్లలో ఒకసారి కంటితుడుపుగా నీళ్లు ఇస్తే సరిపోతుందా? అంటూ ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారులు పట్టించుకోడం లేదని.. ఎస్సీ మహిళను కాబట్టే చిన్న చూపు చూస్తున్నారన్నారు. తమ కాలువల నుంచి కుప్పంకు నీరు తరలిపోతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోందన్నారు. 'ఎస్సీ మహిళ అయితే మీ కాళ్లు పట్టుకోవాలా'.. ఇగో సంతృప్తి పరచడంకోసం కాళ్లు పట్టుకోవాలా అంటూ వీడియోలో ఘాటుగా స్పందించారు.


గడపగడప తిరిగితే ఇమేజ్ పెరుగుతుందని సీఎం చెప్పారని.. తాము గడపగడప కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామన్నారు ఎమ్మెల్యే పద్మావతి.. 2014 – 2019 లాగే క్యాస్ట్ ఈక్వేషన్ 2024 లో ఉంటాయి.. తాను అభ్యర్థిగా పనికిరానప్పుడు.. తాను చెప్పిన వారిని అభ్యర్థిగా ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పద్మావతికి వచ్చే ఎన్నికల్లో సీటు దక్కడం అనుమానమే అంటూ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa