నెల్లూరులో భారీ చోరీ జరిగింది. పక్కా ప్లాన్తో దాడి చేసి బంగారం, డబ్బులు ఎత్తుకెళ్లారు దొంగలు. రామ్మూర్తినగర్ మూడో వీధిలోని ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్న చంద్రశేఖర్రావు, హరికోటేశ్వరరావు అన్నదమ్ములు. వీరు మండపాల వీధిలో జ్యువెలరీ షాపు నిర్వహిస్తున్నారు. ఆభరణాలు విక్రయించడంతో పాటు ఆర్డర్లపై ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని షాపులకు సరఫరా చేస్తుంటారు. మండపాల వీధికి చెందిన బంగారు వ్యాపారి రామాచారి వీరికి స్నేహితుడు.
ఈ నెల 6న హరికోటేశ్వరరావు తన దగ్గర, స్నేహితుడి దగ్గర ఉన్న సుమారు రెండు కేజీల బంగారు ఆభరణాలు తీసుకుని గూడూరులో కొంతమేరకు విక్రయించారు. కొందరు వ్యాపారులు ఇవ్వాల్సిన బకాయిలు రూ.10 లక్షల నగదు ఇచ్చారు. తన దగ్గర ఉన్న 1758 గ్రాముల బంగారు ఆభరణాలు రూ.10 లక్షల నగదు బ్యాగ్లో పెట్టుకున్నారు. రాత్రి గూడూరు నుంచి ఆర్టీసీ బస్సులో నెల్లూరుకు బయలుదేరారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండుకు రావాలని అన్న చంద్రశేఖర్రావుకు ఫోను చేశారు. బస్టాండు చేరేసరికి బైక్తో సిద్ధంగా ఉన్నారు.
అన్నదమ్ములిద్దరూ ఇంటికి రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి మీదుగా వెళుతున్నారు. ముఖానికి మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి అడ్డుకున్నారు. ఒకరు దాడి చేసి నగల బ్యాగ్ను లాక్కొని బైక్ ఎక్కి పరారయ్యారు. వెంటనే బాలాజీనగర్ పోలీసులకు హరికోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు నుంచి బయలుదేరినప్పుడు దోపిడీ జరిగిన స్థలం వరకు ఉన్న ఫుటేజిని సేకరిస్తున్నారు. దోపిడీ చేసిన నిందితులు ఆత్మకూరు బస్టాండు వైపు వెళ్లినట్లు గుర్తించారు. మొత్తం రూ.కోటి విలువైన బంగారం, డబ్బులు చోరీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa