ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుల్వామా ఉగ్రదాడి తర్వాత అర్ధరాత్రి మోదీకి ఫోన్ చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

national |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 09:24 PM

భారత్ పాక్ మధ్య 2019 లో చోటు చేసుకున్న సంఘటనలు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను రాజేశాయి. ఈ క్రమంలోనే ఆ సమయంలో పాక్ పట్ల భారత్ అనుసరించిన వైఖరితో ఆ దేశం తోక ముడిచింది. పుల్వామా దాడులు, ఆ తర్వాత బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్, అనంతరం భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాక్ చిత్రహింసలు పెట్టడం.. వంటి పరిణామాలతో భారత్, పాక్ మధ్య ఒక దశలో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే అప్పటి పరిస్థితులకు సంబంధించి తాజాగా ఒక సంచలన విషయం బయటికి వచ్చింది. అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అర్ధరాత్రి ఫోన్ చేయాలని భారత మాజీ హై కమిషనర్ అజయ్ బిసారియా తెలిపారు.


2019 నాటి పరిస్థితులు, అప్పటి దౌత్య సంబంధాలన్నింటినీ కలిపి భారత మాజీ హై కమిషనర్ అజయ్ బిసారియా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం త్వరలోనే విడుదల కానుండగా.. అందులో నుంచి ఈ విషయాలు బయటికి వచ్చాయి. భారత్ పాక్ మధ్య దౌత్య పరంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసేందుకు ప్రయత్నించారని.. అయితే ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడేందుకు మోదీ విముఖత వ్యక్తం చేసినట్లు ఆ పుస్తకంలో వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 27 వ తేదీన భారత వింగ్ కమాండర్ అభినందన్‌ వర్ధమాన్‌ ప్రయాణిస్తున్న మిగ్ 21 కూలిపోవడంతో ఆయన పారాచూట్ సహాయంతో పాక్ భూభాగంలో దిగారు. అయితే అతడ్ని బంధించిన పాక్‌ జవాన్లు తీవ్రంగా హింసించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్.. పాక్ దేశంపైకి 9 క్షిపణులతో సిద్ధమైందన్న విషయం తెలుసుకుని ఆ దేశం తీవ్రంగా భయపడిందని ఆ పుస్తకంలో పేర్కొన్నట్లు తాజాగా వార్తా కథనాలు వెలువడ్డాయి. ఆ సమయంలో అప్పటి పాక్ హైకమిషనర్‌ సోహైల్‌ మహమ్మద్‌ ఇస్లామాబాద్‌లో ఫిబ్రవరి 27 అర్ధరాత్రి తనను కలిసినట్లు అజయ్ బిసారియా పుస్తకంలో పేర్కొన్నారు.


నరేంద్ర మోదీతో ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోన్‌లో మాట్లాడాలనుకుంటున్నారని తనకు చెప్పాడంతో వెంటనే ఢిల్లీలోని అధికారులకు సమాచారం అందించానని తెలిపారు. ఆ సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌తో మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అందుబాటులో లేరని అధికారులు చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. పాక్‌కు ఏదైనా అత్యవసరమైతే హైకమిషనర్‌గా ఉన్న తనతోనే మాట్లాడాలని చెప్పాలని అధికారులు సూచించినట్లు చెప్పారు. ఆ తర్వాత పాక్‌ అధికారులు మళ్లీ తనను సంప్రదించలేదని అజయ్‌ బిసారియా తన పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌ సన్నిహితుడు తనను సంప్రదించి కిర్గిస్థాన్‌లో జరిగిన ఎస్‌సీవో సదస్సులో భారత్, పాక్ ప్రధానుల మధ్య భేటీ ఏర్పాటు చేయాలని కోరినట్లు అజయ్ తెలిపారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న విధానాలను నరేంద్ర మోదీకి ఇమ్రాన్‌ఖాన్ వివరించనున్నట్లు చెప్పారని.. కానీ ఆ ఎస్‌సీవో భేటీకి ప్రధాని మోదీ హాజరు కాలేదని వెల్లడించారు. అయితే అభినందన్‌ వర్ధమాన్‌ను విడిపించుకునేందుకు పాక్‌వైపు భారత్ క్షిపణులు సిద్ధం చేసినట్లు ఎక్కడా ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదని.. కానీ దాని వల్లే అప్పటి ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వం భయపడిందని వివరించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. అభినందన్‌ వర్థమాన్‌ను పాకిస్థాన్ విడిచిపెట్టి మంచి పని చేసిందని.. లేకుంటే ఆ దేశం భయంకరమైన రాత్రిని చవిచూడాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు.


పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ సైనికులతో వెళ్తున్న కాన్వాయ్‌పై 2019 ఫిబ్రవరి 14 వ తేదీన ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు చేపట్టింది. బాలాకోట్‌ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాతి రోజు అనగా ఫిబ్రవరి 27 వ తేదీన పాక్‌ వైమానిక దళానికి చెందిన ఎఫ్‌-16 విమానంతో భారత్‌పై దాడికి యత్నించింది. దీంతో అప్పుడు వింగ్‌ కమాండర్‌గా ఉన్న అభినందన్‌ వర్థమాన్ తన మిగ్‌-21 విమానంతో వెళ్లి దాన్ని నేలకూల్చారు. అయితే అదే సమయంలో ఆయన మిగ్ 21 కూడా కూలిపోవడంతో పారాచూట్‌ సాయంతో పాక్ భూభాగంలోకి దిగి పాక్‌ జవాన్ల అదుపులోకి వెళ్లారు. అయితే అభినందన్ వర్థమాన్‌ను చిత్రహింసలు పెట్టారు. అభినందన్‌ను తిరిగి అప్పగించాలని భారత్‌ నుంచే కాకుండా అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి పెరగడంతో అట్టారీ - వాఘా సరిహద్దుల్లో భారత్‌కు పాక్ అప్పగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa