టీటీడీ తిరుమల కొండపై వసతి గదులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్లైన్లో చేపట్టింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు ఇవ్వడం వల్ల రద్దీని కొంతమేర తగ్గించొచ్చని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడిప్, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఈ నెల 18 నుంచి బుధవారం (24) వరకు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులు 2 గంటల 45 నిమిషాల్లోనే కొనుగోలు చేశారు.
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి వాళ్లకు అనుమతి లేదు
తిరుమలలో ఇవాళ శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహిస్తున్నారు. ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్లారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి వచ్చే భక్తులకు టీటీడీ ముఖ్య సూచన చేసింది. అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతి లేదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరింది టీటీడీ.
గోగర్భం డ్యామ్ పాయింట్ నుంచి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ దాదాపు 35 బస్సులను ఏర్పాటు చేస్తోంది. గురువారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతిస్తారు. ఈ తీర్థానికి వెళ్లే యాత్రికులకు టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాలు, కాఫీ, పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు.
తిరుమలలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం జనవరి 26న గణతంత్ర వేడుకలకు ముస్తాబైంది. తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయమైన ఈ భవనం ప్రాంగణంలో గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొని తమ సందేశాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమలలో విధులు నిర్వహించే వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొంటారు.
టీటీడీ పరిపాలన భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జనవరి 26వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరిపాలన భవనం వెనక వైపున గల పరేడ్ మైదానంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa