రైతులు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులను మూసివేసిన కేంద్రం.. భారీగా బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తోంది. అయితే రైతులు చేస్తున్న డిమాండ్లలో ప్రధానమైంది పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం. అయితే ఈ కనీస మద్దతు ధర చట్టం గురించి కేంద్రమంత్రి అర్జున్ ముండా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హడావుడిగా పంటలకు కనీస మద్దతు ధరపై చట్టాన్ని తీసుకురాలేమని పేర్కొన్నారు. హామీల అమలు కోసం పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల రైతులు ఆందోళనలు చేస్తున్న వేళ.. కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపుతోంది.
ఎంఎస్పీపై ఇప్పటిప్పుడు చట్టం తీసుకురాలేమని అర్జున్ ముండా పేర్కొన్నారు. దీనిపై చర్చించేందుకు రైతు సంఘాలు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రైతులు చేస్తున్న ఆందోళనలను కొన్ని శక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని.. విపక్షాలను ఉద్దేశిస్తూ అర్జున్ ముండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీని పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రమంత్రి సూచించారు. కనీస మద్దతు ధరపై హడావుడిగా చట్టాన్ని తీసుకురాలేమని.. దానిపై అన్ని వర్గాల వారితో సుదీర్ఘ సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే రైతు సంఘాలు ఆందోళన విరమించి ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చల కోసం రావాలని అర్జున్ ముండా సూచించారు.
అయితే ఇప్పటికే ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రమంత్రుల బృందం చర్చలు జరిపింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్లు.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్కేఎం నేత జగ్జీత్సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్సింగ్ పంధేర్ తదితరులతో సోమవారం చర్చలు జరిపారు. అయితే రైతులు చేసిన డిమాండ్లలో కొన్నింటికి మాత్రమే మంత్రుల బృందం అంగీకారం తెలిపింది. అయితే ప్రధాన డిమాండ్ అయిన ఎంఎస్పీకి చట్టబద్ధతపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు.
మరోవైపు.. ఢిల్లీకి చేరేందుకు సిద్ధమైన అన్నదాతలు.. ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులకు ఎదుర్కొంటున్నారు. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, రైతులకు మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఆందోళన చేస్తున్న రైతులపైకి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa