ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ ఓకే అంటే ప్రచారానికి నేను రెడీ.. జనసేనకు టాలీవుడ్ హీరో మద్దతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2024, 07:13 PM

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, పొత్తుల లెక్కలపై కుస్తీలు పడుతున్నాయి. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యిందంటే ఇక అంతా ప్రచార పర్వమే. నేతల ప్రసంగాలతో ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకూ మైకులు హోరెత్తుతాయి. అయితే ఎన్నికల్లో ప్రచారం కోసం పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను ఏర్పాటు చేసుకుంటాయి. ఊరురా తిరుగుతూ పార్టీ మేనిఫెస్టోను, అవతలి పార్టీ తప్పులను ఎత్తి చూపడమే వీరి లక్ష్యం. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ సింగిల్‌గా బరిలోకి దిగుతూ ఉండగా.. టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. బీజేపీని కూడా కలుపుకుని పోయేందుకు ప్రయత్నిస్తున్నాయి.


అయితే జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఈ సారి ఎన్నికల్లో ఊహించని మద్దతు దొరికింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుఫున ప్రచారం చేసేందుకు యువ హీరో ముందుకు వచ్చారు. తమ కుటుంబ పెద్ద ఓకే అంటే జనసేన తరఫున ప్రచారం చేయడానికి తాను సిద్ధమేనని వరుణ్‌తేజ్‌ అన్నారు. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ మార్చి ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేశారు. మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రమోషన్‍‌లో భాగంగా మూవీ యూనిట్ విజయవాడలో పర్యటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వరుణ్ తేజ్ అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి మూవీలో నటించడమంటే తనకు ఎంతో ఇష్టమని వరుణ్ తేజ్ చెప్పారు. అయితే అలాంటి కథలేవీ ప్రస్తుతం లేవని చెప్పారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో జనసేనకు ప్రచారం చేయమని కుటుంబపెద్ద ఆదేశిస్తే తప్పకుండా తాను ప్రచారానికి వెళ్తానని వరుణ్ తేజ్ చెప్పారు. గతంలోనూ తన తండ్రి నాగబాబు ప్రచారం చేసినప్పుడు తాను వెంట వెళ్లిన సంగతిని గుర్తుచేశారు. బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌, ఆయన నమ్మే సిద్ధాంతాలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న వరుణ్ తేజ్.. అందుకే ఆయనకు ఎప్పడూ సపోర్ట్ చేస్తానని చెప్పారు.


ఇక సినిమాకు సంబంధించి తెలుగులో ఎయిర్ ఫోర్స్ నేపథ్యంగా వచ్చిన మొదటి సినిమా ఆపరేషన్ వాలంటైన్ అని వరుణ్ తేజ్ చెప్పారు. దేశభక్తి నేపథ్యంగా ఈ కథ సాగుతుందని అన్నారు. ‘కంచె’ తరువాత ఇలాంటి సినిమా రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పుల్వామా ఘటనల నేపథ్యంలో దీన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఫిబ్రవరి 14న పుల్వామా బ్లాక్ డే ఘటన జరిగిందన్న వరుణ్ తేజ్.. అదే రోజు ప్రేమికుల రోజు కావటంతో సినిమాకు ఆపరేషన్ వాలంటైన్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. యువతరానికి ఈ మూవీ స్ఫూర్తిగా నిలుస్తుందన్న వరుణ్ తేజ్.. మార్చి ఒకటో తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని ఆశీర్వదించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa