చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజం గెలవాలి పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న భువనేశ్వరి.. ప్రస్తుతం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉన్నారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించిన భువనేశ్వరి.. అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో తనకు మద్దతిస్తారా లేదా చంద్రబాబుకు మద్దతిస్తారా అంటూ అక్కడున్న వారిని ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లుగా కుప్పం ప్రజలు గెలిపిస్తున్నారని.. ఈసారి ఆయనకు రెస్ట్ ఇద్దామని భువనేశ్వరి అన్నారు. ఇదే క్రమంలో తనను గెలిపిస్తారా అంటూ సరదాగా చమత్కరించారు.
" ఓ జోక్ వేస్తున్నా. మీ ఆన్సర్లన్నీ ఫ్రీగా ఇవ్వాలి. కుప్పం వచ్చిన తర్వాత నా మనసులో ఓ కోరిక కలిగింది. చంద్రబాబుపై నమ్మకంతో 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చాక నాకో కోరిక కలిగింది. ఈసారి ఆయనకు రెస్ట్ ఇచ్చి, నేను పోటీ చేద్దామని అనుకుంటున్నా. మీరు ఎవరికి మద్దతిస్తారు. నేను కావాలో, చంద్రబాబు కావాలో చేతులెత్తి చెప్పండి" అంటూ భువనేశ్వరి చమత్కరించారు. అయితే ఇద్దరూ కావాలంటూ అక్కడున్న సభికులు చేతులెత్తటంతో భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కావాలంటే కుదరదనీ, ఎవరో ఒకరి పేరు మాత్రమే చెప్పాలన్నారు. అయితే ఆ తర్వాత ఇదంతా సరదాగా అంటున్నానన్న భువనేశ్వరి.. నా మనసుకు నచ్చిన పనిమాత్రమే చేస్తానన్నారు. నాకే పోస్టులు వద్దంటూ చెప్పారు.
అయితే నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయాల నుంచి చంద్రబాబును తప్పుకోవాలని ఆయన భార్య చెప్తు్న్నారంటూ వైసీపీ అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. దీనికి భువనేశ్వరి వీడియోను జతచేశారు. చంద్రబాబు స్థానంలో కుప్పం నుంచి తాను బరిలో ఉంటానని భువనేశ్వరి చెప్తున్నారన్న వైసీపీ.. చంద్రబాబు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ట్వీట్కు తెలుగుదేశం పార్టీ తన ఎక్స్ ఖాతా వేదికగా కౌంటర్ ఇచ్చింది. నిజానిజాలు తెలియాలంటే పూర్తి వీడియోను చూడాలని ట్వీట్ చేసింది. ఇలా వీడియోలు ఎడిట్ చేసి శునకానందం పొందడం ఏంటంటూ కౌంటర్లు వేసింది. మొత్తానికి భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధానికి కారణమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa