ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీపై అభిమానం.. కవలలు పుట్టినా చూడకుండా ప్రధాని కోసం పరుగు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 11:05 PM

ఏ వ్యక్తికైనా జీవితంలో తండ్రి అయినప్పుడు కలిగే ఆనందమే వేరు. భార్యకు ప్రసవం అవుతుంటే పక్కనే ఉండి పుట్టబోయే బిడ్డను అందరికంటే ముందు తానే చేతుల్లోకి ఎత్తుకోవాలని చాలా మంది తండ్రులు వేచి చూస్తారు. అలాంటి అద్భుత క్షణం కోసం కొన్ని నెలలుగా వేచి చూస్తారు. ఇక ఒకే కాన్పులో కవల పిల్లలు పుడితే ఎలా ఉంటుంది. డబుల్ బొనాంజనే కదా. కానీ ఆ వ్యక్తి మాత్రం తనకు కవలలు పుట్టారని తెలిసినా.. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారని తెలిసి.. తన బిడ్డలను చూడటానికంటే ముందు మోదీని చూడాలనే పరిగెత్తారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీకి ఆ కార్యకర్త చెప్పగా.. ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్విటర్ వేదికగా తెలుపుతూ ఆ కార్యకర్తతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?


లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు చేపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం తమిళనాడులో పర్యటించారు. తమిళనాడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసేందుకు వచ్చిన ప్రధాని మోదీకి బీజేపీ నేతలు చెన్నై ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఆ బీజేపీ నేతల్లో ఉన్న అశ్వంత్ పిజాయ్ జి అనే వ్యక్తి గురించి ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే అశ్వంత్ ఒక సాధారణ బీజేపీ కార్యకర్త అయినప్పటికీ.. ఆయన చేసిన పని అతడిని ఇప్పుడు వార్తల్లో ఉండేలా చేసింది.


ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై ఎయిర్‌పోర్టుకు వస్తున్నారని తెలియగానే.. అప్పుడే ఆస్పత్రిలో ఉన్న తన భార్య కవల పిల్లలకు జన్మనిచ్చిందని.. అశ్వంత్‌కు సమాచారం అందింది. అలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు.. వెంటనే పరిగెత్తుకుంటూ ఆస్పత్రికి వెళ్లి తన బిడ్డలను చూసుకుంటారు. కానీ అశ్వంత్ మాత్రం అలా చేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అభిమానం, ప్రేమతో.. ఆస్పత్రికి వెళ్లకుండా నేరుగా చెన్నై ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే మోదీని కలిసిన అశ్వంత్.. తన భార్య కవల పిల్లలకు జన్మనిచ్చిందని.. వారిని చూడకుండా మీ కోసమే వచ్చానని చెప్పాడు. అశ్వంత్ మాటలు విన్న ప్రధాని మోదీ కొంత ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగానే అశ్వంత్‌ను కలిసిన ఫోటోను ట్వీట్ చేశారు.


ఈ సందర్భంగా మోదీ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. "బీజేపీకి చాలా అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు అనే విషయం అశ్వంత్‌ను చూస్తే నిజమని స్పష్టం అవుతోంది. తనను అశ్వంత్‌ కలవడం సంతోషంగా ఉంది. అశ్వంత్‌కు కవల పిల్లలు పుట్టారని వారిని చూడకుండా వచ్చినట్లు చెప్పారు. తన వద్దకు రాకుండా వారి వద్దకు వెళ్లి ఉంటే బాగుండేదని నేను అశ్వంత్‌తో అన్నాను. ఈ సందర్భంగా అశ్వంత్‌కు అతని కుటుంబానికి ఆశీస్సులు అందజేస్తున్నాను. అప్పుడే పుట్టిన బిడ్డలను చూడకుండా నా కోసం వచ్చిన అశ్వంత్ ప్రేమకు ధన్యుడిని" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సంఘటన కేవలం బీజేపీ కార్యకర్తలనే కాకుండా విన్న ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa