ఇన్ఫోసిస్ మాజీ ఛైర్మన్, రచయిత్రి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సుధామూర్తి నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్టు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రధాని తెలియజేశారు. సుధామూర్తిపై ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. సామాజిక సేవ, విద్యలో ఆమె చేసిన సేవలను మోదీ కొనియాడారు.
‘సుధామూర్తిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేశారనే వార్త చెప్పడానికి సంతోషిస్తున్నాను.. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనది.. స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభలో ఉండటం మన 'నారీ శక్తికి శక్తివంతమైన నిదర్శనం.. . దేశ సమర్థతని, మహిళల శక్తిని పెంచాలన్న మా లక్ష్యానికి ఇదో గొప్ప ఉదాహరణ
’ అని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఇక, ఇన్పోసిస్ ఎదుగుదలలో సుధామూర్తి శ్రమ ఎంతగానో ఉంది. ఆ సంస్థకు ఛైర్మన్ హోదాలోనూ పనిచేశారు. ప్రస్తుతం 83.92 బిలియన్ డాలర్ల విలువ కలిగిన స్థాయికి చేరిన ఇన్ఫోసిస్ ప్రారంభంలో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నట్లు, దాని కోసం అనేక త్యాగాలను చేయాల్సి వచ్చినట్లు సుధామూర్తి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ కుమార్తె అక్షతా మూర్తిని మూడు నెలల చంటిబిడ్డను తమ తల్లిందండ్రుల దగ్గర వదిలిపెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. ఒక కంపెనీ స్థాపించినప్పుడు.. ఎదురయ్యే కష్టమైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సుధామూర్తి చెప్పారు.
పిల్లల పెంపకం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక సందర్భంలో సూచించారు. ‘ఎవరి కలలు వారివే. తల్లిదండ్రులు తమ కలలను పిల్లల మీద రుద్దకూడదు. పిల్లలు ప్రతి ఒక్కరికీ తమకంటూ కొన్ని ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఉంటాయి. వాటిని తల్లిదండ్రులు గౌరవించాలి.. వ్యక్తి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి డబ్బు ప్రామాణికం కాదు. క్లాసులోని పిల్లల్లో కొందరు ఎక్కువ డబ్బు ఉన్న ఇంటి వాళ్లు ఉంటారు. కొందరు తక్కువ డబ్బు ఉన్న వాళ్లు ఉంటారు. అందరితో ఒకేరకంగా స్నేహంగా మెలగాలని పిల్లలకు నేర్పించాలి’ అని చెబుతారు సుధామూర్తి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa