చిలకలూరిపేటలో ఈ నెల 17న జరగనున్న టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల ఉమ్మడి సభను తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. సభను జయప్రదం చేసేందుకు 13 కమిటీలను టీడీపీ నియమించింది. ఈ సభ నిర్వహణ, కమిటీలతో సమన్వయము బాధ్యతను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు తెలుగుదేశం హైకమాండ్ అప్పగించింది. కాగా మంగళవారం కమిటీ సభ్యులందరితో ఉదయం 11 గంటలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. సభా నిర్వహణకు సంబంధించి ఈ రోజు నుంచే అందరూ వర్క్లోకి రావాలని చంద్రబాబు కోరనున్నారు. ఇప్పటికే నరేంద్ర మోదీ పర్యటనను ప్రధాని కార్యాలయం ఖరారు చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో నిన్ననే కమిటీల నియామకం జరిగింది. ప్రధాని మోదీ ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించే భారీ సభలో పాల్గొంటారు. పదేళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి రానుండడంతో మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. వాస్తవానికి 16వ తేదీన ఆయన విశాఖ వస్తారని.. బీజేపీ ర్యాలీలో పాల్గొంటారని ప్రకటన వెలువడింది. అయితే ఈ పర్యటన రద్దయిందంటూ స్థానిక బీజేపీ నేతలకు పార్టీ జాతీయ నాయకత్వం సోమవారం సాయంత్రం సమాచారమిచ్చింది. ఉమ్మడి బహిరంగ సభను విజయవంతం చేయడానికి 3 పార్టీల నుంచి 115 మంది నేతలతో 12 ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల వివరాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం రాత్రి ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa