వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. అసంతృప్తులు గత కొంత కాలంగా జగన్ వైఖరిని తప్పుపడుతూ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ నేతలను బుజ్జగించేందుకు జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నేతలకు ఏదో ఒక హామీని ఇస్తూ శాంతపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు పార్టీ మారిన విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో కాపు నేతలు కూడా పవన్ కళ్యాణ్కు మద్దతించేందుకు సిద్ధమవుతుండటంతో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇందులో భాగంగానే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. తాడేపల్లి సీఎం కార్యాలయంలో జగన్ను గురువారం నాడు ఎమ్మెల్యే పెండెం దొరబాబు కలిశారు. ఈ సారి దొరబాబుకు పిఠాపురం వైసీపీ టికెట్ను జగన్ ఇవ్వలేదు. దొరబాబు స్థానంలో పిఠాపురం టికెట్ను వంగాగీతకు ఇచ్చిన విషయం తెలిసిందే. టికెట్ ఇవ్వకపోవడంతో కొంత కాలంగా దొరబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జన్మదిన వేడుకలు నిర్వహించి బలప్రదర్శనతో దొరబాబు తన అనుచరుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాన్లో భాగంగానే దొరబాబును జగన్ బుజ్జగిస్తున్నారు. ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఈ సీటును జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ను ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాడేపల్లి కార్యాలయానికి దొరబాబు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ని కలిసిన తర్వాత ఈ విషయంపై పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. సీఎంవో నుంచి ఫోన్ రావడంతో సీఎం జగన్ను కలిశానని తెలిపారు. పిఠాపురం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని సీఎం జగన్ అన్నారని.. ఆయనను ఓడించాలని ఆదేశించారని తెలిపారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించాలని తనను సీఎం ఆదేశించారన్నారు. గీతకు మద్దతిస్తానని జగన్కు తెలిపానని అన్నారు. గీతను గెలిపించేందుకు పనిచేస్తానని సీఎంకు చెప్పానని ఎమ్మెల్యే దొరబాబు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa