తిరుమలలో వచ్చే మూడు నెలలు భక్తుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తోంది టీటీడీ. ఈ మేరకు వచ్చే మూడు నెలల పాటు రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం వేసవిలో ఏర్పాట్లపై వివరాలను వెల్లడించారు. వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని.. తద్వారా సాధారణ భక్తుల దర్శనానికి ఎక్కువ సమయం ఉండేలా చూస్తామన్నారు.
సాధారణ భక్తుల సౌకర్యార్థం సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన వేళలు ఇస్తూ సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసిందని తెలిపారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, బయట లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, అల్పాహారం, నిరంతరాయంగా పంపిణీ చేస్తామన్నారు. వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే తిరుమల మాడ వీధులు, నారాయణగిరి గార్డెన్స్ వెంబడి కూల్ పెయింటింగ్స్ వేయించడంతో పాటుగా తాగునీరు పాయింట్లు వంటి ఏర్పాట్లు
చేస్తామన్నారు. అంతేకాదు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉండటంతో టీటీడీ సిఫార్సు లేఖల్ని అనుమతించడం లేదు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.. కాబట్టి జూన్ 10 వరకు ఈ లేఖల్ని అనుమతించే అవకాశం ఉండదని చెబుతున్నారు.
వేసవి రద్దీ సమయంలో భక్తులకు సహాయం అందించేందుకు స్కౌట్స్ మరియు గైడ్స్తో పాటు 2500 మంది శ్రీవారి సేవకులను నియమించారు. తిరుమలలో వేసవి రద్దీ ఉంటుంది కాబట్టి.. భక్తులకు సహాయసహకారాలు అందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్తో పాటు 2500 మంది శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారన్నారు. వేసవి కాలం కావడంతో శేషాచల అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలను నివారించడానికి టీటీడీ అటవీ శాఖ, ప్రభుత్వ అగ్నిమాపక శాఖలతో కలిసి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. వేసవి రోజుల్లో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నీటిని వృథా చేయొద్దని.. జాగ్రత్తగా వినియోగించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఏప్రిల్ 9న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు
సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విఐపి బ్రేక్ దర్శనం, కుంకుమార్చన, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa