తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థాన వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. ఉగాదిని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేసారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
విశేషంగా శ్రీవారికి రూపాయి హారతి సమర్పణ చేశారు. గత శుక్రవారం అభిషేక సేవ అనంతరం శ్రీవారికి విశేష అలంకరణ అయిన వజ్ర కవచ అలంకరణ నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం వేడుకలు నిర్వహించామన్నారు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు. ప్రపంచమంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంలను టీటీడీ రద్దు చేసింది.
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa