ఉగాది పర్వదినం సందర్భంగా వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇస్తోన్న గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసు.. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు.. నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా వాలంటీర్లకు ఈ శుభవార్తను ప్రకటించారు.
2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించిన జగన్ సర్కారు.. వారి ద్వారానే ఫించన్ల పంపిణీ సహా అనే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వారికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం అందిస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతోన్న వేళ.. చంద్రబాబు ఈ ప్రకటన చేయడం గమనార్హం. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ఇంతకు ముందే చెప్పామన్న టీడీపీ అధినేత.. వైఎస్సార్సీపీకి సేవ చేయొద్దు.. ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని వాలంటీర్లకు భరోసా ఇచ్చారు.
తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంపై పెడతానని జగన్ చెబుతున్నారని.. అంటే ఇప్పుడు ఆ వ్యవస్థ లేనట్టే కదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. వాలంటీర్లను రాజీనామా చేయకుండానే వైఎస్సార్సీపీకి పని చేయమంటున్నారని.. డిగ్రీలు, పీజీలు చదువుకున్న వారితో తప్పుడు పనులు చేయించి.. కేసులు పెట్టించేలా చేస్తున్నారని బాబు ఆరోపించారు. తాము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చిన బాబు.. ఉగాది పండగ రోజున తీపి కబురు అందిస్తున్నాం.. మీకు రూ.10 వేలు పారితోషికంగా ఇస్తామన్నారు.
వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తుండగా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసారి అలా చేయడానికి వీల్లేకుండాపోయింది. అయితే వాలంటీర్లు ఫించన్లు పంపిణీ చేయకుండా.. చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. వాలంటీర్ల సేవలను నిలిపివేసేలా చేసిన నిమ్మగడ్డ ఎవరో ప్రజలకు తెలుసంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa