తిరుమల శేషాచలం అడవుల్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పార్వేట మండపం సమీపంలో ఉన్న శ్రీగంధం ప్లాంట్లో శుక్రవారం మంటలు చెలరేగాయి. తిరుమల నుంచి పాప వినాశనం మార్గంలో ఈ పార్వేట మండపం ఉంది. ఈ పార్వేట మండపానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలోనే శ్రీవారి కోసం టీటీడీ శ్రీగంధం చెట్లు పెంచుతోంది. అగ్నిప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లు, రెండు వాటర్ ట్యాంకుల సాయంతో మంటలను అదుపుచేశారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్మేసింది. మరోవైపు మంటలు ఎలా చెలరేగాయనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనే దానిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఎండాకాలం కావటంతో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంతం ఎంతో విలువైన వృక్ష, జంతు సంపదకు నిలయం. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఫారెస్ట్ సిబ్బంది చర్యలు తీసుకోవాలనేది భక్తుల కోరిక. అటు టీటీడీ సైతం ఇప్పటికే దీనిపై చర్యలు చేపట్టింది. మంటలు వ్యాపించకుండా అక్కడక్కడా మట్టిరోడ్లు వేశారు. అలాగే ఎండిన చెట్లను సైతం తొలగిస్తున్నారు. అయినప్పటికీ అగ్ని ప్రమాదం జరగటంతో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa