ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూడూరుని నెల్లూరులో కలుపుతా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 02:46 PM

అధికారంలోకి రాగానే గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతానని టీడీపీ అధినేత చంద్రబాబు హమీ ఇచ్చారు. గూడూరు పట్టణంలోని సీఆర్‌రెడ్డి కల్యాణ మండపంలో శనివారం ఉదయం ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలకు మొదటి సారి 8శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. ఆడబిడ్డలను ప్రపంచంలో తిరుగులేని శక్తిగా మార్చేందుకు తానూ కృషి చేస్తానన్నారు. మహిళల కోసం మద్యనిషేఽధాన్ని అమలుపరుస్తానని హామీ ఇచ్చిన జగన్‌ నాసిరకం మద్యం విక్రయిస్తూ ఎంతోమంది మరణాలకు కారణమవుతున్నాడన్నారు.బటన్‌ నొక్కి అందినకాడికి నొక్కేస్తున్నాడని విమర్శించారు.ఆయన జగన్మోహన్‌రెడ్డి కాదని జే గన్‌రెడ్డి, మోసపురెడ్డి, జలగరెడ్డి అని ఎద్దేవా చేశారు. కొద్దిరోజుల్లో ఓటరు చేతికి రెండు బటన్లు వస్తాయని అందులో బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌కు ఒకటి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌కు మరొకటి నొక్కి జగన్‌ను ఇంటికి సాగనంపాలన్నారు. చిల్లకూరులో సిలికాను, సూళ్లూరుపేట నియోజకవర్గంలో స్వర్ణముఖి నది నుంచి ఇసుకను వైసీపీ నాయకులు అక్రమంగా దోచుకున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే సిలికా, ఇసుక అక్రమ రవాణాను నియంత్రించి సహజసంపదను భావితరాలకు అందించే బాధ్యత తీసుకుంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థులు పాశిం సునీల్‌కుమార్‌, వరప్రసాద రావు, పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్‌, వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ, సూళ్లూరుపేట అభ్యర్థిని నెలవల విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, పరసారత్నం, నెలవల సుబ్రమణ్యం,నాయకులు నరసింహయాదవ్‌, వాకాటి నారాయణరెడ్డి, పనబాక కృష్ణయ్య, శీలం కిరణ్‌కుమార్‌, తానంకి నానాజి, జనసేన కో ఆర్డినేటర్‌ తీగల చంద్రశేఖర్‌, బీజేపీ నాయకుడు పాపా పురుషోత్తంరెడ్డి, సీబీఎన్‌ ఫోరం నాయకురాలు సునీత, సంధ్యారాణి, చక్రల ఉష తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com