మన పక్క నుంచి రైలు పరిగెడుతుంటేనే భయంతో వణికిపోతూ ఉంటాం. ఎక్కువగా రైలు ప్రయణం చేయని వారు ఎప్పుడైనా రైలు ఎక్కితే ఏదో ఒక రకంగా భయపడుతూ ఉంటారు. ఇక కొందరు చిన్న పిల్లలు అయితే రైలు శబ్ధాలు విని ఏడుస్తూనే ఉంటారు. కానీ ఓ 8 ఏళ్ల బాలుడు మాత్రం రైలుపై ప్రమాదకరమైన రీతిలో ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించి అందర్నీ షాక్కు గురి చేశాడు. అది కూడా గూడ్స్ రైలు బోగీల మధ్యలో చక్రాల నడుమ బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉన్న ఆ బాలుడిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్-ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించి.. బయటికి తీసుకువచ్చారు. అనంతరం ఆ బాలుడి వివరాలు తెలుసుకుని చైల్డ్ కేర్ హోంకు తరలించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
లక్నో నుంచి హర్దోయ్కి ప్రయాణించే గూడ్స్ రైలు ఓ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగింది. అయితే ఆ రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉండే ఓ 8 ఏళ్ల బాలుడు.. ఆడుకుంటూ వెళ్లి ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కాడు. రెండు చక్రాల మధ్య ప్రమాదకరంగా ఉన్న ప్రాంతంలో కూర్చున్నాడు. అయితే కొద్దిసేపటికి ఆ గూడ్స్ రైలు కదలడంతో దానిపైనే అలాగే వెళ్లాడు. ఆ గూడ్స్ రైలు ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణించి హర్దోయ్ రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఆ హర్దోయ్ రైల్వే స్టేషన్లో ఆగిన గూడ్స్ రైలును పరిశీలించిన ప్రయాణికులు అందులో ఒక బాలుడు ఉండడాన్ని గమనించారు. వెంటనే రైల్వే స్టేషన్లో ఉన్న ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు.
గూడ్స్ రైలుపై బాలుడు ప్రయాణిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి ఆ బాలుడిని గుర్తించారు. అనంతరం ఆ రైలు నుంచి మెల్లగా ఆ బాలుడిని బయటికి తీసుకువచ్చారు. భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆ బాలుడు.. బనియన్, షార్ట్ వేసుకుని ముఖానికి మొత్తం దుమ్ము ధూళితో కనిపించాడు. అనంతరం ఆ బాలుడి వద్ద నుంచి వివరాలు తెలుసుకున్న అధికారులు షాక్ అయ్యారు. వంద కిలోమీటర్ల దూరం ఆ బాలుడు అలా ప్రమాదకరంగా గూడ్స్ రైలుపై ప్రయాణించినట్లు తెలుసుకున్నారు.
ఆ బాలుడి కుటుంబం అలంనగర్ రాజాజీపురంలోని బాలాజీ మందిర్లో నివాసం ఉంటున్నట్లు ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ బాలుడిని చైల్డ్ కేర్ హోమ్కు తరలించారు. ఇక ఆ గూడ్స్ రైలు నుంచి బాలుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది బయటికి తీసుకువస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది తెగ వైరల్గా మారింది.
![]() |
![]() |