ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. వేసవి రద్దీతో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖ- చెన్నై ఎగ్మోర్(08557) ప్రత్యేక రైలు ఈనెల 27 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం రాత్రి 7గంటలకు విశాఖలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.45 గంటలకు ఎగ్మోర్ వెళుతుంది. ఈ రైలు చెన్నై ఎగ్మోర్-విశాఖ(08558) తిరుగు ప్రయాణంలో ఈనెల 28 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎగ్మోర్లో బయలుదేరి రాత్రి 10.35 గంటలకు విశాఖ వస్తుంది. ఈ రైలు విశాఖలో బయల్దేరి దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
విశాఖ-హతియా(08555) ప్రత్యేక రైలు ఈనెల 28 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖలో బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు హతియా వెళుతుంది. హతియా-విశాఖ(08556) ప్రత్యేక రైలు ఈనెల 29 నుంచి జులై 1 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటలకు హతియాలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9.50గంటలకు విశాఖ వస్తుంది. ఈ రైలు విశాఖలో బయల్దేరి విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం స్టేషన్లలో ఆగుతుంది.
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు కాకినాడ పోర్ట్లో బయల్దేరి.. కాకినాడ టౌన్, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, దుర్గాడ గేట్, అన్నవరం, తుని, గుల్లిపాడు, నర్సీపట్నం రోడ్, రేగుపాలెం, ఎలమంచిలి, నరసింగపల్లి, కసింకోట, అనకాపల్లి, దువ్వాడ, మర్రిపాలెం, విశాఖపట్నంలో ఆగుతుంది. భావనగర్-కాకినాడ పోర్టు(12756) రైలును మే 4, 11, 18, 25 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల నిమిత్తం ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.