ఏపీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ అన్నాచెల్లెలి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించి వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య గతకొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో షర్మిల ఇదే ప్రధానాస్త్రంగా ప్రచారం సాగిస్తున్నారు. ఇక షర్మిల వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో జగన్ సైతం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. పచ్చచీర కట్టుకుని ప్రత్యర్థులతో చేతులు కలిపిందంటూ పులివెందుల ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో తాను కలిసిపోయానంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు.
కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ షర్మిల.. వైఎస్ జగన్ తనపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అలాగే సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అద్దం గిఫ్టుగా పంపుతున్నట్లు చెప్పారు. అద్దంలో చూసుకుంటే జగన్కు తన బొమ్మ కనిపిస్తోందో లేక చంద్రబాబు బొమ్మ కనిపిస్తుందో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. "జగన్ మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపిందట, సునీత చంద్రబాబుతో చేతులు కలిపిందట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మాటే వింటారట. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి కూడా చంద్రబాబే కారణమట. జగన్ చంద్రబాబును ఎంత పవర్ ఫుల్గా ఊహించుకుంటున్నాడో దీనితో అర్థమవుతోంది." అని షర్మిల అన్నారు.
"జగన్ మెంటల్ స్టేటస్ గురించి నాకు భయమేస్తోంది. అబ్సెషన్ లాగా అనిపిస్తోంది. ఏం జరిగినా చంద్రబాబే కారణమట. జగన్ గారూ.. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే.. మీ ముఖం కనిపిస్తోందా.. చంద్రబాబు ముఖం కనిపిస్తోందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంతగా చంద్రబాబు పిచ్చిపట్టిందో జనాలకు సమాధానం చెప్పండి." అని షర్మిల ప్రశ్నించారు,
"సునీత న్యాయం కోసం కొట్లాడుతుంటే.. మీరు చెప్పాల్సిన సమాధానాలు చెప్పడం లేదు. చంద్రబాబుతో చేతులు కలిపామని అంటున్నారు. వివేకాను దారుణంగా చంపితే హార్ట్ ఎటాక్ అని ఎందుకు ప్రచారం చేశారు? చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ వివేకా హత్యపై సీబీఐ విచారణ అడిగిన మీరు.. మీరు అధికారంలోకి వచ్చాకా ఎందుకు వద్దన్నారు? వీటికి సమాధానాలు ఎందుకు చెప్పడం లేదు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారు" అని షర్మిల ప్రశ్నించారు.
తాను ఒక్కసారి మాత్రమే చంద్రబాబును కలిశానన్న వైఎస్ షర్మిల.. తన కుమారుడి పెళ్లికి పిలవడానికి మాత్రమే కలిశానని చెప్పారు. అప్పట్లో వైఎస్ఆర్ కూడా చంద్రబాబును పెళ్లికి పిలిచారన్న షర్మిల.. అదే స్ఫూర్తితోనే తాను చంద్రబాబును పిలవడానికి వెళ్లినట్లు చెప్పారు. ఏ రోజూ తాను ఐదునిమిషాలు కూడా చంద్రబాబుతో మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.నేను చంద్రబాబు చెప్తే నీకోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానా ? బై బై బాబు అనే క్యాంపెయిన్ చేశానా అని ప్రశ్నించారు. తాను వైఎస్ఆర్ బిడ్డనని.. ఎవరి చెప్పుచేతల్లో ఉండే రకం కాదని షర్మిల అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa