దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. జూన్ 4 నుంచి మొదటి ప్రయివేట్ రైలు అందుబాటులోకి వస్తోంది. ఈ రైలు కేరళ రాజధాని తిరువనంతపురం- గోవా మార్గంలో రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ (SRMPR) గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచే ఈ రైలు ప్రధానలక్ష్యం పర్యాటకులను ఆకర్షించడం. ‘భారత్ గౌరవ్యాత్ర’ ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ రైలు సర్వీసును నిర్వహించనున్నారు.
తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో కొల్లం, త్రివేండ్రం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ సహా పలు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఒకేసారి 750 మంది ప్రయాణించగలిగే ఈ రైల్లో.. 2 స్లీపర్ క్లాస్, 11 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ కోచ్లు ఉన్నాయి. అలాగే, వైద్యలు సహా మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైఫై సదుపాయం, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ వంటి సౌకర్యాలు కల్పించారు. స్టార్ హోటల్లో బస, భోజన సదుపాయంతోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించే ప్యాకేజీలను కూడా అందించనున్నారు. నాలుగు రోజుల ప్యాకేజీ నాన్-ఏసీ రూ.13,999 నుంచి ప్రారంభమవుతుంది. థర్డ్ ఏసీ లేదా సెకెండ్ ఏసీలకు మాత్రం వేర్వేరుగా ఉంటాయి.
కాగా, ‘భారత్ గౌరవ్’ పథకం పేరుతో ప్రైవేటు రైళ్లను నడపనున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో భాగంగా మొదటి ప్రైవేటు రైలు రెండేళ్ల కిందట తమిళనాడు, మహారాష్ట్ర మధ్య ప్రయోగాత్మకంగా నడిపారు. కోయంబత్తూరు నార్త్- షిరిడీ సాయినగర్ మధ్య ప్రయివేటు రైలు సర్వీసును దక్షిణ రైల్వే ప్రారంభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa