ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బుల జమపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ పథకాల (చేయూత, ఆసరా, విద్యా దీవెన, ఈబీసీ నేస్తం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ)కు సంబంధించిన నిధుల్ని.. ఈ నెల 11 (శనివారం) నుంచి 13 (సోమవారం) తేదీ వరకు లబ్ధిదారులకు జమ చేయొద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 13న పోలింగ్ ముగిసే వరకు పథకాల డబ్బుల్ని జమ చేయొద్దంటూ ఈసీ ఈ నెల 9 (గురువారం)న ఇచ్చిన ఆదేశాలను 10 (శుక్రవారం) వరకు తాత్కాలికంగా పక్కన పెట్టింది.
పథకాలకు సంబంధించిన నిధుల పంపిణీని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడానికి వీల్లేదని హైకోర్టు ఆదేశించింది. ప్రధానంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకూడదని.. ఎలాంటి ఉత్సవాలు, వేడుకలు నిర్వహించకూడదని తేల్చి చెప్పింది. అంతేకాదు రాజకీయనేతల ప్రమేయం కూడా ఉండకూడదని ఆదేశించింది. ప్రధాన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించి.. తదుపురి విచారణను జూన్ 27కి వాయిదా వేశారు.
ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి నిధులు విడుదల చేయకుండా ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని పలవురు లబ్ధిదారులు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు జరిగాయి. ఈ నెల 13న పోలింగ్ ముగుస్తుందని.. ఆ తర్వాత పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తే అభ్యంతరం లేదని ఎన్నికల సంఘం తరఫు లాయర్ వాదించారు. వాస్తవానికి ఎన్నికల ప్రక్రియ జూన్ 6తో ముగుస్తుందని.. అప్పటి వరకు నిధులు జమ చేయొద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ తమకు తాజాగా కొన్ని వివరాలు సమర్పించారని.. వాటిని పరిశీలించిన తర్వాత పోలింగ్ తర్వాత జమ చేయొచ్చని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిధుల్ని రెండు, మూడు రోజులు ఆపితే నష్టమేమీ లేదన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు జమ చేస్తే ఎన్నికల ప్రక్రియపై ప్రభావం ఉంటుందన్నారు. పోలింగ్కు ముందు డబ్బుల్ని జమ చేస్తే ఎన్నికల్ని ప్రభావితం చేసినట్లవుతుందన్నారు. తాము కూడా నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఈ పథకాలు కొత్తవి కాదని.. గతం నుంచి అమలవుతున్నాయని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిలుపుదల చేయడం సరికాదని.. వారిపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. అలాగే ఇప్పటికే కొనసాగుతున్న పథకాల నిధుల్ని ఆపాల్సిన అవసరం లేదని ఎన్నికల ప్రవర్తన నియమావళి చెబుతుందన్నారు. లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లలో డబ్బుల్ని జమ చేస్తారని.. అధికార పార్టీ నేలు ప్రచారం చేసుకోకుండా ఈసీ షరతులు విధించొచ్చన్నారు. ఇవేవీ కొత్త పథకాలు కాదని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదించారు. ప్రభుత్వం నిధుల లభ్యతను బట్టి నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు.. నిధులు జమ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ వాదనలన్నీ విన్న కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa