ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్ 9 వ తేదీతో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగియగా.. ఈసారి భారీఎత్తున ఓటింగ్ జరిగింది. ఇక ఎంతమంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారనే దానిపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కీలక వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 4 లక్షల 44,216 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నట్లు ముకేశ్కుమార్ మీనా తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 4,44,218 పోస్టల్ ఓట్లు నమోదైనట్లు చెప్పారు. మే 4 నుంచి 9వ తేదీ వరకూ ఆరు రోజులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అవకాశం ఇచ్చినట్లు ముకేష్ కుమార్ మీనా చెప్పారు. ఆఖరి రోజు పార్లమెంట్ నియోజకవర్గాలకు 11,374 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకి 11,370 పోస్టల్ ఓట్లు పోలైనట్లు చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్కు సంబంధించి నెల్లూరు పార్లమెంటు పరిధిలో అత్యధికంగా 22,650 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఇక అత్యల్పంగా అమలాపురం పార్లమెంటు పరిధిలో 14,526 ఓట్లు పోలయ్యాయని చెప్పారు. పోలైన ఓట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఏపీ ఎన్నికల్లో మొత్తం 14 నియోజకవర్గాలలో వందశాతం వెబ్కాస్టింగ్ ఏర్పాటుచేసినట్లు ఏపీ సీఈవో తెలిపారు ఈ నియోజకవర్గాలలో 28 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీఈవో కార్యాలయంతోపాటు అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్ల ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నట్లు చెప్పారు.
మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెరగడంపై రాజకీయ వర్గాల్లో భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగే పార్టీలు కూడా తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే ఉద్యోగులు అధికసంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసినట్లు కూటమి నేతలు చెప్తున్నారు. అయితే తమ ప్రభుత్వ విధానాలు నచ్చి ఉద్యోగులు పెద్దసంఖ్యలో ఓట్లు వేసేందుకు వచ్చినట్లు అధికార వైసీపీ చెప్తోంది. మరి ఉద్యోగుల తీర్పు ఏంటనేదీ జూన్ నాలుగో తేదీన తేలనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa