ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఈసారి అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. 2019 ఎన్నికల్లో రెండుచోట్లా పోటీచేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఈసారి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అదే రీతిలో ప్రచారం సాగించారు. అటు వైసీపీ కూడా పవన్ కళ్యాణ్కు గట్టిపోటీ ఇచ్చేందుకు వంగా గీతను బరిలోకి దింపింది. ముఖ్యంగా పిఠాపురం నియోజవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా పావులు కదులుతూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలోనూ పిఠాపురాన్ని ఆఖరిగా ఎంచుకున్న వైఎస్ జగన్.. పిఠాపురం సభ వేదికగా వంగా గీతకు బంపరాఫర్ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పిఠాపురంలో వైఎస్ జగన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్.. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే వచ్చే వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంను చేస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. పపన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురంలో ఉండరని.. అదే వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానంటూ ప్రకటించారు. 2019లో గెలిచి అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ .. తన ప్రభుత్వంలో ఐదుగురికి డిప్యూటీ ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ పునర్వవస్థీకరణ తర్వాత కూడా ఆయన ఈ సంఖ్య తగ్గించలేదు. సామాజిక సమీకరణాల్లో భాగంగా కాపు సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం కేటాయిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కాపు సామాజికవర్గానికి చెందిన వంగా గీతను ఉపముఖ్యమంత్రిని చేస్తానని జగన్ ప్రకటించారు.
మరోవైపు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గ ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు వైసీపీ కూడా వ్యూహాత్మకంగా కాపు సామాజికవర్గ మహిళానేత అయిన వంగా గీతను బరిలోకి దింపింది. ఇప్పుడు జగన్ కూడా అంతే వ్యూహాత్మకంగా.. ఆమెకు డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa