ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్.. అమల్లోకి ఆంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 07:21 PM

విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వ్యక్తిగత దూషణలు, సవాళ్లు ఇలా రోజుకో రకంగా సాగిన ఏపీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సుమారు నెలరోజులపాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. మే 13వ తేదీ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. మే 11 సాయంత్రం ఆరు గంటల నుంచి మే 13వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకూ 48 గంటలపాటలు సైలెన్స్ పీరియడ్ కొనసాగనుంది. అయితే ఎన్నికల ప్రచారానికి తెరపడగా.. పార్టీలన్నీ పోల్ మేనేజ్‌మెంట్ మీద దృష్టి సారించాయి.


మరోవైపు ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఈ 48 గంటలపాటు అమల్లో ఉండే నిబంధనలపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు 13వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. 169 నియోజకవర్గాలలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. అరకు లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు తప్ప మిగతా అన్నిచోట్లా సాయంత్రం 6 గంటల వరకూ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అరకు లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ముకేష్ కుమార్ మీనా తెలిపారు.


అలాగే పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇకఎన్నికల ప్రచారం ముగియటంతో ఈరోజు ( మే11) సాయంత్రం ఆరుగంటల తర్వాత సభలు, సమావేశాలు పెట్టకూడదని ఏపీ సీఈవో స్పష్టం చేశారు. అలాగే స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండేందుకు వీలులేదని ఆదేశించారు. అయితే పర్యాటక ప్రాంతాలు, ఆధ్యా్త్మిక కేంద్రాల సందర్శనకు వచ్చినవారికి మినహాయింపు ఉందని ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


సైలెన్స్ పీరియడ్‌లో ఆంక్షలివే..


సభలు, సమావేశాలు నిషేధం.


ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదు.


టీవీ, రీడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిషిద్ధం.


ప్రింట్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారానికి అనుమతి


ఈసీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరన్న సీఈవో


ప్రీసర్టిఫికేషన్ ఉంటేనే ప్రింట్ మీడియాలో ప్రచారం


రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్.


ఐదుమంది కంటే ఎక్కువ మంది గుమికూడటం నిషేధం.


లౌడ్ స్పీకర్లు, మైకులు, బల్క్ మెసేజ్‍లు బంద్.


స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లిపోవాలి.


పార్టీల ఇంఛార్జులు కార్యాలయాల్లోనే ఉండాలి.


పర్యాటక ప్రాంతాల్లో నిబంధనల్లో కాస్త సడలింపు.


పర్యాటక, ఆధ్యా్త్మిక ప్రాంతాలలో సడలింపు.


సందర్శనకు, ఆలయాలకు వచ్చే వారికి సడలింపు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa