దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రచార పర్వం పూర్తికాగా.. మే 13వ తేదీ పోలింగ్ జరగనుంది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలలో నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. మే 12వ తేదీ సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది..పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటారని తెలిపింది. అయితే సుమారుగా 24 గంటలకు పైబడి పోలింగ్ సిబ్బంది.. పోలింగ్ బూత్ల వద్ద విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అసలే తీవ్రమైన ఎండలు.. ఆపై వడగాల్పులు.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం.. పోలింగ్ సిబ్బందికి అందించాల్సిన ఆహారం మెనూను ప్రకటించింది. ఈ మెనూ ప్రకారం ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి పోషకాలతో కూడిన ఆహారం అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
పోలింగ్ సిబ్బంది మెనూ ఇదే..
ఎన్నికల విధుల్లో భాగంగా మే 12వ తేదీ సాయంత్రానికే సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు వారికి సమోసా, మజ్జిగ అందించాలని ఈసీ ఆదేశించింది. ఐదు గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం.. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో అన్నం, కూర, టమాటా పప్పు, చట్నీ, చపాతి, పెరుగుతో కూడిన భోజనం అందించాలని ఈసీ స్పష్టం చేసింది. మే 13వ తేదీ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉదయం ఆరింటికి టీ, రెండు అరటిపండ్లు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల్లో పేర్కొంది.
మే 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 9 మధ్య ఉప్మా, పల్లీల చట్నీని అల్పాహారంగా ఇవ్వాలని.. అలాగే 11 నుంచి 12 గంటల సమయంలో మజ్జిగ ఇవ్వాల్సి ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్లో భాగంగా కోడిగుడ్డు కూర. చట్నీ, సాంబారు, పెరుగు, కూరతో భోజనం ఏర్పాటు చేయాలి. మూడు నుంచి 4 గంటల మధ్య మజ్జిగ లేదా నిమ్మరసం అందించాలి. సాయంత్రం ఐదున్నర సమయంలో టీ, బిస్కెట్లు ఇవ్వనున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ సిబ్బంది భోజన, వసతి ఏర్పాట్లను పంచాయతీ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు పర్యవేక్షిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa