జైలు నుంచి బయటికి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే 10 గ్యారెంటీలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉచితంగా విద్యుత్, విద్య, వైద్యాన్ని అందిస్తామని ప్రకటించారు. ఇంతేకాకుండా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా, దేశవ్యాప్తంగా ఉద్యోగాల కల్పన, అగ్నివీర్ స్కీ్మ్ రద్దు, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, అవినీతిపై యుద్ధం, జీఎస్టీ మరింత సరళతరం చేయడం సహా కీలక హామీలను వెల్లడించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ 10 గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
కేజ్రీవాల్ కీ గ్యారెంటీ..
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలతో పోల్చితే నాణ్యమైన విద్యుత్ అందించేలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం.
ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు కల్పించడం.. ఉచితంగా వైద్యం అందించడం.
చైనా ఆక్రమించిన మన దేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయడం.
దేశంలోని రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం. వ్యవసాయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం.
ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించడం.
ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించడం.
దేశాన్ని అవినీతి రహితంగా మార్చడంతో పాటు అవినీతికి పాల్పడే వాళ్లపై కఠినంగా వ్యవహరించడం.
జీఎస్టీని సరళతరం చేయడం వంటి హామీలను ఇచ్చారు.
కేజ్రీవాల్ కీ గ్యారెంటీ విడుదల చేసిన ఢిల్లీ సీఎం.. ఈ సమయంలోనే బీజేపీ ఇచ్చిన హామీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు ఫెయిల్ అయ్యాయని.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తమ పార్టీకి ట్రాక్ రికార్డ్ ఉందని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ, పంజాబ్లలో ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. అదే విధంగా దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పారు. ఇచ్చిన 10 హామీల్లో తొలి ప్రాధాన్యం ఉచిత విద్యుత్కేనని స్పష్టం చేశారు. మన దేశానికి 3 లక్షల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని.. కానీ 2 లక్షల మెగావాట్లకే పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు. డిమాండ్కు మించిన విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa